మీ టీవి, మీ ఇష్టం.. ఛానళ్ల ఎంపిక గడువు పెంచిన ట్రాయ్
ఢిల్లీ : కొత్త టారిఫ్ విధానంలో తమకు నచ్చిన ఛానళ్లు ఎంచుకోవడానికి.. టెలికం రెగ్యులెటరీ అథారిటీ - ట్రాయ్ మరోసారి గడువు పొడిగించింది. గతంలో జనవరి 31 వరకు ఉన్న గడువును మార్చి 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఛానళ్ల ఎంపికలో తర్జనభర్జన పడుతూ.. టారిఫ్ ఎంచుకోవడానికి ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు ఊరట లభించినట్లైంది. వినియోగదారుల ఛాయిస్ మేరకు బెస్ట్ ఫిట్ ప్లాన్ రూపొందించాలని ఆపరేటర్లను ఆదేశించింది ట్రాయ్.
మీ టీవి.. మీ ఇష్టం
కొత్త టారిఫ్ ఎంపిక విషయంలో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏ ప్యాకేజీ తీసుకోవాలో తెలియక తికమకపడుతున్నారు. కొన్నిచోట్ల కేబుల్ ఆపరేటర్లు వివరాలతో కూడిన లిస్ట్ ఇచ్చినప్పటికీ.. తమకు అనుకూలమైన ప్యాక్ ఎంచుకోవడంలో అవస్థలు పడుతున్నారు. మరికొన్ని చోట్ల ఆపరేటర్లు ఎలాంటి వివరాలు చెప్పకపోవడంతో గందరగోళం నెలకొంది. అయితే కొత్త టారిఫ్ ఎంపికకు జనవరి 31 వ తేదీని తుది గడువుగా విధించింది ట్రాయ్. కొత్త టారిఫ్ ఎంచుకోనివారికి ఫిబ్రవరి 1 నుంచి కొన్ని ఛానళ్లు ప్రసారం కావడం లేదు. దీంతో మరింత అయోమయానికి గురవుతున్నారు వినియోగదారులు. ఈ నేపథ్యంలో కొత్త టారిఫ్ ఎంచుకోవడానికి మార్చి 31వ తేదీ వరకు మరోసారి గడువు పెంచింది ట్రాయ్.
బెస్ట్ ఫిట్ ప్లాన్ తీసుకురండి.. ట్రాయ్ ఆదేశం
కొత్త టారిఫ్ విధానం తెరపైకి రావడంతో.. ఛానళ్ల ఎంపికపై తర్జనభర్జన పడుతున్నారు వినియోగదారులు. ప్యాకేజీలు కూడా వినియోగదారుల అవసరాల మేరకు లేవనే ఆరోపణలున్నాయి. కేబుల్ ఆపరేటర్లు వినియోగదారులకు అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారనేది ట్రాయ్ వాదన. అందుకే వినియోగదారుల ఛాయిస్ మేరకు వారికి సరిపోయే బెస్ట్ ఫిట్ ప్లాన్ రూపొందించాలని డ్రిస్టిబ్యూషన్ ప్లాట్ ఫాం ఆపరేటర్స్ (డీపీవో) కు సూచించినట్లు తెలిపింది ట్రాయ్. కొత్త మార్గదర్శకాల ప్రకారం తాము చూడాలనుకునే ఛానళ్లకు మాత్రమే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. 130 రూపాయలకే 100 ఛానళ్లు ఉచితంగా చూసే ఛాన్సుంది. ఆ తర్వాత ఏయే ఛానళ్లు కావాలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది.
ఈసారైనా వందకు వంద శాతం..!
వినియోగదారుల్లో అవగాహనలోపం, కేబుల్ ఆపరేటర్ల నిర్లక్ష్యం తదితర కారణాలతో కొత్త టారిఫ్ పై వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదనేది ట్రాయ్ వాదన. అందుకే జనవరి 31 వరకు ఉన్న గడువును.. మార్చి 31వ తేదీ వరకు పొడిగించింది ట్రాయ్. అంతలోపు వినియోగదారులు బెస్ట్ ఫిట్ ప్లాన్ కిందకు ఎప్పుడైనా మారొచ్చు. దీనికోసం ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయబోరు. టీవి ఛానళ్ల ప్యాక్ సెలెక్ట్ చేసుకోవడానికి మరింత గడువు దొరకడంతో వినియోగదారులకు ఊరట దొరికినట్లైంది. దేశవ్యాప్తంగా టీవి వినియోగదారులను కొత్త టారిఫ్ విధానంలోకి తీసుకురావాలన్న ట్రాయ్ ప్రయత్నాలు ఈసారైనా ఫలిస్తాయో లేదో చూడాలి.