ట్రాయ్ ఎఫెక్ట్ : ఎయిర్ టెల్, ఐడియా షేర్లు పైపైకి... రిలయన్స్ షేరు కిందికి
సమ్మర్ సర్ ప్రైజ్ పేరిట రిలయన్స్ జియో ప్రవేశపెట్టిన 3 నెలల ఉచిత ఆఫర్ ను తక్షణమే నిలిపివేయంటూ ట్రాయ్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దాని ప్రత్యర్థి కంపెనీల షేర్లు పరుగులు తీశాయి.
ముంబై: రిలయన్స్ జియో జోరుకు టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) అనూహ్యంగా చెక్ చెప్పడం దేశీయ టెలికాం ఆపరేటర్లకు బాగా కలిసొచ్చింది. తాజాగా జియో ప్రవేశపెట్టిన 'సమ్మర్ సర్ప్రైజ్' ఉచిత ఆఫర్లను నిలిపివేయాలంటూ ట్రాయ్ ఆ దేశించిన నేపథ్యంలో ప్రత్యర్థి కంపెనీల షేర్లు పరుగులు పెట్టాయి.
ఇటీవల టారిఫ్లలోకి ఎంట్రీ ఇచ్చిన జియో తన ప్రైమ్ మెంబర్షిప్ పథకంలో ఉచిత ఆఫర్ను మూడు నెలలపాటు పొడిగిస్తున్నట్టు ప్రకటించి ప్రత్యర్థి కంపెనీలపై బాంబు వేసింది. అయితే జియో తాజా ఆఫర్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని, తక్షణమే ఆ ఆఫర్ ను నిలిపివేయాలని ట్రాయ్ తాజాగా ఆదేశించింది.
ఈ నేపథ్యంలో ముఖ్యంగా భారతి ఎయిర్ టెల్, ఐడియా తదితర మేజర్ టెలికాం కంపెనీలు పండగ చేసుకుంటున్నాయి. శుక్రవారం నాటి మార్కెట్లో మదుపర్లు టెలికాం ఇండెక్స్ లో కొనుగోళ్ల వైపు మొగ్గు చూపారు.
ఒకవైపు దలాల్ స్ట్రీట్ నష్టాల పాలవుతుండగా టెలికాం షేర్లు మాత్రం లాభాలనార్జించడం విశేషం. భారతి ఎయిర్ టెల్ దాదాపు 3 శాతానికిపైగా జంప్ చేసి టాప్ గెయినర్గా నిలిచింది. ఇదే బాటలో ఐడియా సెల్యులర్ పయనిస్తూ 2 శాతానికిపైగా పుంజుకుంది. మరోవైపు ఇటీవలి రికార్డ్ స్థాయి లాభాలను పొందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక శాతానిపైగా నష్టపోయింది.