త్వరలో: 11 అంకెలతో కూడిన మొబైల్ నెంబర్లు..కసరత్తు చేస్తున్న ట్రాయ్
త్వరలో 11 అంకెలు ఉన్న మొబైల్ ఫోన్ నెంబర్లు రానున్నాయా...? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇందుకోసం కేంద్రం కూడా ఆలోచిస్తోందని తెలుస్తోంది. టెలికాం రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా 11 అంకెల మొబైల్ నెంబర్లపై అభిప్రాయాల సేకరణ చేసేందుకు సమాయాత్తమవుతోంది. ఇక దేశంలో జనాభా పెరిగిపోతుండగా అదే సమయంలో మొబైల్ ఫోన్ల వినియోగదారుల సంఖ్యకూడా పెరిగిపోతోంది.
ఇప్పటికే ప్రభుత్వం 13 అంకెలతో కూడిన సిరీస్ను ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కు కేటాయించింది. 2050నాటికి 2.6 బిలియన్ నెంబర్లు అవసరమవుతాయని ట్రాయ్ చెబుతోంది.2027 నాటికి జానాభాలో భారత్ చైనా జనాభాను దాటుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేస్తోంది. 2050 నాటికి 1.64 బిలియన్ జనాభా భారత్ కలిగి ఉంటుందని చెప్పింది.
దేశంలో ప్రస్తుతం 1.2 టెలిఫోన్ కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటికే ట్రాయ్ ఫిక్స్డ్ ల్యాండ్లైన్లకు మొబైల్ సేవలకు ఒక స్థిరమైన నంబరింగ్ విధానం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. మొబైల్ ఫోన్లు వినియోగించే వారి సంఖ్య 2050 నాటికి 200 శాతం పెరిగితే.. మొబైల్ వినియోగదారుల సంఖ్య దాదాపుగా 3.28 బిలియన్కు చేరుకుంటుందని చెబుతోంది.
ఇక 11 అంకెల మొబైల్ నెంబర్లు అమలు చేసేందుకు సూచనలు ఇవ్వాలని ట్రాయ్ అధికారులను కోరింది. ఫిక్స్డ్ ల్యాండ్ లైన్ ఫోన్లకు 10 అంకెల నెంబర్ కొనసాగిస్తూనే మొబైల్ ఫోన్లకు 11 అంకెలు అమలు విధానంపై సూచనలను కోరింది. మొబైల్ ఫోన్ల ద్వారా డేటా కనెక్షన్ తీసుకునేవారికి 13 నెంబర్లు కేటాయింపును కూడా ఆలోచిస్తోంది.కొత్త నెంబర్ సిరీస్లను 3,5,6 అంకెలతో ప్రారంభించాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న మొబైల్ ఫోన్ నెంబర్లకు 9,8,7 అంకెలతో ప్రారంభమవుతోంది.ఇక దీనిపై ప్రజాభిప్రాయం సేకరించేందుకు అక్టోబర్ 21ని చివరితేదీగా ప్రకటించగా అభిప్రాయాలపై స్పందించేందుకు నవంబర్ 4న చివరితేదీగా ప్రకటించింది.