ట్రాయ్ కొత్త టారిఫ్: టీవీలో మీరు చూసే ఛానెళ్లకు మాత్రమే డబ్బులు చెల్లించండి
భారత్లో ఇకపై టీవీ కార్యక్రమాలు వీక్షించాలనుకునేవారు కేబుల్ ప్రసారాలకు ప్రస్తుతం కడుతున్న బిల్లు కంటే మరింత ఎక్కువ కట్టాల్సి వస్తుంది. కొత్తగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్)తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం టీవీ ఛానెళ్ల ప్రసారాలను వీక్షించేందుకు అదనంగా వినియోగదారుడు కేబుల్ ఆపరేటర్లకు చెల్లించాల్సి వస్తుంది. ఈ కొత్త టారిఫ్ జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఇక కొత్తగా తీసుకొచ్చిన టారిఫ్లతో వినియోగదారుడు తనకు ఇష్టం వచ్చిన ఛానెళ్లను వీక్షించేందుకు వీలు కల్పించింది. కస్టమర్ వీక్షించే ఛానెల్స్కు మాత్రమే డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది.
ఒక్కో నెట్వర్క్ ఒక్కో ధర నిర్ణయించాయి
ట్రాయ్ కొత్త నిబంధనలు తీసుకురావడంతో అన్ని టీవీ నెట్వర్క్లు తమ ఛానెళ్లను వీక్షించేందుకు గాను ఒక సమిష్టి ధరను ఏర్పాటు చేసుకున్నాయి. ఆ ప్యాక్ ద్వారా తమ ఛానెళ్లను వీక్షించే అవకాశం ఉంది. ఉదాహరణకు స్టార్ నెట్వర్క్ తెలుగు (స్టార్ మా) చూడాలనుకునేవారు రూ. 39 చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఒక్కో నెట్వర్క్ ఒక్కో ధరను నిర్ణయించాయి. దీంతో కస్టమర్పై భారం పడనుంది. ఇక మధ్యభారత దేశంలోని రాష్ట్రాల్లో అన్ని ఛానెల్స్ చూడాలంటే నెలకు రూ. 440 చెల్లించాల్సి ఉంటుంది. ఇక మూడవ ఫేజ్, నాల్గవ ఫేజ్ పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ. 200 నుంచి రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది. ఇక నగరాల్లో అయితే 250కి మించి ఛానెళ్లు వస్తున్నాయి. ఇందులో స్పోర్ట్స్ ఛానెల్స్, ప్రాంతీయ ఛానెల్స్ వస్తున్నాయి. ఇలాంటి చోట్ల రూ. 350 నుంచి రూ. 400 కేబుల్ ఆపరేటర్లకు చెల్లించాల్సి ఉంటుంది.
తొలి 100 ఛానెళ్లకు రూ. 130 ప్లస్ ట్యాక్సులు
కొత్త పద్ధతి ప్రకారం తొలి 100 ఛానెళ్లకు రూ. 130తో పాటు జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. వీటిని ఫ్రీ టు ఎయిర్ విభాగంలో చేర్చారు. వీటిలో స్టార్ ఇండియా, జీ ఎంటర్టెయిన్మెంట్, సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా లాంటి ఛానెళ్లు రావు. ఒకవేళ కస్టమర్ బేసిక్ ప్యాకేజీలు ఎంచుకుంటే 95 పే ఛానెళ్లకు రూ. 184 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీనితో పాటు మరో 20 ఉచిత ఛానెల్స్కు రూ. 100 అదనంగా చెల్లించాలి. ఇక స్పష్టంగా చెప్పాలంటే కేవలం బేసిక్ ఛానెళ్లకు మాత్రమే నెలకు రూ. 450 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో స్పోర్ట్స్ ఛానెళ్లు రావు. ఇక మొత్తం ఛానెల్స్ కావాలంటే నెలకు రూ. 800 చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా 35 నుంచి 55శాతం డిస్కౌంట్ పోను అది దాదాపు రూ.600కు వచ్చే అవకాశం ఉంది.
కస్టమర్లు కొత్త టారిఫ్కు ఒప్పుకుంటారా..?
ఇక ట్రాయ్ నిబంధనలపై కేబుల్ ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త నిబంధనలు ఇంకా చాలామందికి తెలియదని... ఒకవేళ డబ్బులు అదనంగా చెల్లించమని అడిగితే వాగ్వాదానికి దిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక ఏ ఛానెళ్లు చూడాలో సరిగ్గా ప్లాన్ చేసుకోగలిగితే ఇది బాగానే ఉంటుంది. ఆ ఛానెళ్లకు మాత్రమే డబ్బులు చెల్లించి ప్రసారాలను వీక్షించే అవకాశం ఉంది. అది తక్కువలో తక్కువగా రూ. 250లోపు అయిపోతుంది. ప్రస్తుతం కస్టమర్లు కూడా ఇంతే చెల్లిస్తున్నారు.