ఎయిర్టెల్ వొడాఫోన్లకు ట్రాయ్ షాక్..ఆందోళనలో కస్టమర్లు ఎందుకో తెలుసా?
న్యూఢిల్లీ: సరికొత్త స్పీడుతో సరికొత్త డేటా ప్లాన్లను అందించాలని ప్రతిపాదన పెట్టిన ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థలు ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలకు బ్రేక్ వేసింది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్). ఈ రెండు టెలికాం సంస్థలు తీసుకొస్తున్న ప్లాన్లు ఇతర సబ్స్క్రెబర్లపై ప్రభావం చూపుతుందని ట్రాయ్ పేర్కొంది. అందుకే ఎయిర్టెల్, వొడాఫోన్లను తమ ప్లాన్లను నిలిపివేయాల్సిందిగా కోరుతూ మధ్యంతర ఉత్తర్వులు ట్రాయ్ జారీ చేసినట్లు సమాచారం.
ఎయిర్టెల్ వొడాఫోన్లకు ట్రాయ్ షాక్
ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తీసుకొచ్చిన నిర్దిష్ట ప్లాన్లు ఇతర సబ్స్క్రైబర్లపై ప్రభావం చూపదా అని ట్రాయ్ తన లేఖ ద్వారా ప్రశ్నించింది. సాధారణ సబ్స్క్రైబర్స్ ప్రయోజనాలను ఎలా కాపాడుతారో చెప్పాలని ప్రశ్నించింది. కొత్త ప్లాన్లు అధిక ధరలతో కూడుకున్నవని దాన్ని కొంత మంది మాత్రమే చెల్లించగలిగే శక్తి ఉందని మరి ఇతర కస్టమర్ల పరిస్థితేంటని ప్రశ్నించింది. అయితే తమ వినియోగదారులకు బెస్ట్ సర్వీసులను, నాణ్యమైన నెట్వర్క్లను అందించడమే తమ ప్రాధాన్యమని ఎయిర్టెల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. తాము అత్యుత్తమమైన సేవలు, నాణ్యమైన నెట్వర్క్ అందిస్తున్న కారణంగా కస్టమర్లు డేటా స్పీడ్ పరంగా కానీ, వీడియోల పరంగా కానీ సంతృప్తి వ్యక్తం చేయడంతో అంతర్జాతీయ సంస్థలు సైతం తమను గుర్తిస్తున్నాయని ఎయిర్టెల్ ప్రతినిధి చెప్పారు.
సాధారణ కస్టమర్ల పరిస్థితేంటి..?
ఇక దీన్ని దృష్టిలో ఉంచుకునే పోస్ట్పెయిడ్ కస్టమర్ల పరిమితిని పెంచుతూ వారికి మరిన్ని సేవలను బాధ్యతాయుతంగా అందజేయాలని భావిస్తున్నట్లు ఎయిర్టెల్ వెల్లడించింది.ఇది ఎప్పటికీ జరిగే ప్రక్రియ అని ఎయిర్టెల్ వివరించింది. నెలకు రూ.499 అంతకు మించి చెల్లించే పోస్ట్పెయిడ్ కస్టమర్లను ప్లాటినం మొబైల్ కస్టమర్ల కేటగిరి కిందకు చేర్చుతూ వారికి అధిక ప్రాధాన్యత ఇస్తామని గత సోమవారం ఎయిర్టెల్ ప్రకటించింది. ఇతర సాధారణ కస్టమర్లతో పోలిస్తే ప్లాటినం కస్టమర్లకు 4జీ డేటా పరంగా అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఎయిర్టెల్ వెల్లడించింది. దీనిపైనే నోటీసులు ఇచ్చిన ట్రాయ్ వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కోరింది.
వొడాఫోన్ రెడ్ ఎక్స్ ప్లాన్ సంగతేంటి..?
ఇక వొడాఫోన్ ఐడియా కూడా ఇదే తరహా ప్లాన్ను ప్రారంభించింది. రెడ్ఎక్స్ పోస్ట్ పెయిడ్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్లకు 50శాతం అధిక వేగంతో డేటా ఇవ్వడం జరుగుతుందని పేర్కొంది. వొడాఫోన్ రెడ్ఎక్స్ ప్లాన్తో అపరిమిత డేటా ఇవ్వడంతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా కల్పిస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.ఇందులో కాల్స్, ప్రీమియం కంటెంట్, అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్ వంటివి తమ కస్టమర్లకు అందిస్తున్నామని చెప్పారు. వొడాఫోన్ ఐడియా అత్యుత్తమ సేవలను అందించడంలో ముందుండాలన్న ఉద్దేశంతో ఈ తరహా ప్లాన్ను ప్రారంభించినట్లు చెప్పారు. అంతేకాదు ఇప్పటికే వొడాఫోన్ 4జీ స్పీడ్ చాలా బాగుందని దీన్ని కొన్ని ప్రపంచ స్థాయి సంస్థలు ధృవీకరించాయని గుర్తుచేశారు.
ఎనిమిది నెలలుగా అమలులో వొడాఫోన్ ప్లాన్
రెడ్ఎక్స్ ప్లాన్ వివరాలు గతేడాది నవంబర్లోనే ట్రాయ్కు సమర్పించామని ఆ తర్వాత ప్లాన్లలో మార్పులు చేసి మళ్లీ ఈ ఏడాది మేలో సబ్మిట్ చేశామని చెప్పారు. ఇప్పటికే ఈ ప్లాన్ మార్కెట్లోకి విడుదలై 8 నెలలకు కావొస్తోందని చాలామంది కస్టమర్లు ఈ ప్లాన్ వినియోగిస్తున్నారని వెల్లడించారు.అయితే టారిఫ్ నిబంధనల ఉల్లంఘన ఎక్కడా జరగలేదని వొడఫోన్ సంస్థ మరోసారి స్పష్టం చేసింది. మొత్తానికి ట్రాయ్ ఎయిర్టెల్, వొడాఫోన్లపై సీరియస్ కావడంతో ఇప్పటికే ఈ ప్లాన్లు తీసుకున్న కస్టమర్ల పరిస్థితి ఏంటో తెలియాలంటే కొన్ని రోజులు వేచిచూడక తప్పదు.