చెన్నై నీటి కష్టాలు: రైల్లో 25 లక్షల లీటర్లు నీరు తరలింపు.. వరణుడి కరుణ ఎప్పుడు?
జోలార్ పేటై: తమిళనాడులో నీటికష్టాలకు ఇంకా తెరపడలేదు. కొంతలో కొంతైనా ఈ సమస్యకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ట్యాంకర్లలో నీటిని నింపి చెన్నై నగరానికి పంపింది. ఇప్పటికే చెన్నైలోని రిజర్వాయర్లు అడుగంటిపోవడం... అంతకంతకు పెరిగిపోతున్న నీటి కష్టాలతో అక్కడి పరిశ్రమలు కూడా ఉత్పత్తిని బంద్ చేశాయి. జోలార్ పేటై నుంచి WAG5 HA23907 ఉన్న ట్రైన్ నెంబరు 50 వ్యాగన్లలో నీటిని నింపుకుని ఉదయం 7:30 గంటలకు చెన్నైకి బయలుదేరింది.
గురువారం ఉదయం నుంచే సిబ్బంది జోలార్ పేటైలో వ్యాగన్లను నీటితో నింపారు. మొత్తం 50 వ్యాగన్లలో ఒక్కో వ్యాగన్లో 50వేల లీటర్ల నీటిని నింపారు. ఈ నీటిని మరో నది నుంచి తీసుకున్నారు. ఈ రైలు శుక్రవారం చెన్నైకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఈ నీటిని ఓ కారు తయారీ సంస్థ వినియోగించుకోనుంది. ఇప్పటికే నీటి కొరతతో కొన్ని స్కూళ్లను మూసివేయడం జరిగింది. అంతేకాదు కొన్ని కంపెనీలు మూసివేసి తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
చెన్నై నీటి కష్టాలు: రైల్లో 25 లక్షల లీటర్లు నీరు తరలింపు.. వరణుడి కరుణ ఎప్పుడు? #ChennaiWaterCrisis pic.twitter.com/zqqEIepo5o
— Oneindia Telugu (@oneindiatelugu) July 12, 2019
వర్షాలు పూర్తి స్థాయిలో పడకపోవడంతో చెన్నైకి నీటి సరఫరా చేసే నాలుగు ప్రధాన రిజర్వాయర్లు ఎండిపోయాయి. తమిళనాడు పరిస్థితి ఇలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీ, గార్డెన్ సిటీ బెంగళూరులో కూడా నీటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక జోలార్పైటై నుంచి బయలు దేరిన రైలు గురువారం ఉదయం 11:30 గంటలకు చేరాల్సి ఉండగా... వ్యాగన్ల వాల్వ్లో లీకేజీ కారణంగా రైలు శుక్రవారం చేరుకోనుంది. మరోవైపు శివార్లలో నివసిస్తున్న ప్రజలు రోడ్లపై వెళుతున్న వాటర్ ట్యాంకర్లను అడ్డుకుంటున్నారు. తమ వద్ద ఉన్న నీటిని నగరవాసులకు చేరుస్తూ తమకు నీళ్లు లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.