రైలు ప్రమాదాల ప్రధాన సూత్రధారి షన్షుల్ నేపాల్లో అరెస్ట్
రైలు ప్రమాదాల నేపథ్యంలో ఈ ప్రమాదల కేసుల్లో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ షన్షుల్ హుడాను నేపాల్లో అరెస్ట్ చేశారు.
న్యూఢిల్లీ: ఇటీవల దేశంలో జరిగిన వరుస రైలు ప్రమాదాలకు ఉగ్రవాదులే కారణమని అనుమానాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఉగ్రవాదులు రైలు పట్టాలపై పేలుళ్లు జరపడం వల్లే రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయని భద్రతా వర్గాలు భావించాయి.
కాగా, రైలు ప్రమాదాల నేపథ్యంలో ఈ ప్రమాదల కేసుల్లో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ షన్షుల్ హుడాను నేపాల్లో అరెస్ట్ చేశారు. దేశంలో జరిగిన మూడు వరుస రైలు ప్రమాదాల కేసులను విచారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ).. ఈ ప్రమాదాలకు హుడాను ప్రధాన సూత్రధారిగా పేర్కొంది.
నవంబర్ నెలలో కాన్పూర్లో జరిగిన రైలు ప్రమాదంలో ఇండోర్-పాట్నా ఎక్స్ప్రెస్ రైలుకు చెందిన 14బోగీలు పట్టాలు తప్పడంతో 150మంది మరణించారు. ఈ కేసులో హుడా హస్తం ఉందని భావిస్తున్నారు. అతడి ఆదేశాల మేరకే ఈ రైలు వెళ్లే మార్గంలో పట్టాల మీద బాంబులు పెట్టారని, గ్యాస్ కట్టర్లతో పట్టాలు కోశారని పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన అన్ని రైలు ప్రమాదాల వెనక ఐఎస్ఐ హస్తం ఉందని అనుమానిస్తున్నారు. బీహార్లో మోతీ పాశ్వాన్, ఉమాశంకర్ పటేల్, ముఖేష్ యాదవ్ అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, విచారించగా షన్షుల్ హుడా పాత్ర బయటపడిందని సమాచారం. బీహార్లోని మోతిహారి ప్రాంతంలో జరిగిన ఇద్దరు యువకుల హత్యకేసులో వాళ్లను విచారించగా.. అనుకోకుండా రైలు ప్రమాదాల కుట్ర కోణం కూడా బయటపడినట్లు తెలిసింది.
నేపాల్కు చెందిన బ్రిజ్ కిశోర్ గిరి అనే వ్యక్తి కూడా రైలు ప్రమాదం కేసులో నిందితుడిగా ఉన్నాడు. హుడా అతడికి చెప్పి ఇద్దరు యువకులతో బాంబులు పెట్టించాడని అనుమానిస్తున్నారు. వాళ్లు బాంబులు పెడుతూ దొరికిపోవడంతో బీహార్కు చెందిన ముగ్గురితో ఆ ఇద్దరిని హుడా చంపించినట్లు తెలిసింది.