వీడియో: ఏనుగును ఢీ కొట్టిన ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్: కదల్లేక, నడవ లేక!
కోల్ కత: పశ్చిమ బెంగాల్ లో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రైలు ఢీ కొట్టడంతో ఓ ఏనుగు తీవ్రంగా గాయపడింది. పట్టాల మీది నుంచి కదల లేని స్థితికి చేరుకుంది. లేచి నిల్చోలేక పోయింది. అతి కష్టం మీద తన ముందరి రెండు కాళ్లతో పాకుతూ పట్టాలను దాటుకోవడం కంట తడి పెట్టించింది. ఈ నెల 27వ తేదీన పశ్చిమ బెంగాల్ లోని జల్పాయ్ గురి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన పట్ల ప్రముఖులు సైతం తమ విషాదాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏనుగును ఢీ కొట్టిన తరువాత రైలింజన్ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.
ఏనుగులకు మృత్యు కుహరం..
పశ్చిమ బెంగాల్ ఉత్తర ప్రాంతంలో దట్టమైన అడువులు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఏనుగుల సంచారం అధికం. ఈ అడవుల మధ్య నుంచే రైలు మార్గాన్ని వేశారు. సిలిగురి-ఢుబ్రి సెక్షన్ మధ్య రాకపోకలు సాగించడానికి ఇదే ప్రధాన మార్గం. శుక్రవారం బనర్హట్-నాగ్రకాటా స్టేషన్ల మధ్య పట్టాలు దాటుతున్న ఓ ఏనుగును సిలిగురి ఎక్స్ ప్రెస్ ఢీ కొట్టింది. ఏనుగు పట్టాలపైకి వచ్చిన వెంటనే రైలింజన్ లోకో పైలెట్ బ్రేకులు సైతం వేశారు. అయినప్పటికీ.. రైలు ఆగలేదు. వేగంగా వెళ్లి.. ఏనుగును ఢీ కొట్టిన అనంతరం ఆగిపోయింది.
చలించిన ప్రయాణికులు
ఈ ప్రమాదంలో ఏనుగు తీవ్రంగా గాయపడింది. దాని రెండు కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. చాలాసేపటి వరకు ఏనుగు లేచి నిల్చోలేకపోయింది. రక్తమోడుతున్న ముందరి కాళ్లతోనే పాకుతూ పట్టాలను దాటుకుంది. ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షులుగా నిలిచిన రైలు ప్రయాణికులు..ఆ ఏనుగును చూసి చలించిపోయారు. కంటతడి పెట్టారు. కొందరు ప్రయాణికులు గాయపడ్డ ఏనుగును వీడియో తీశారు. ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలోొ పోస్ట్ అయిన వెంటనే ఈ వీడియో వైరల్ గా మారింది. కొందరు ప్రముఖులను కదలించింది. ఏనుగుల సంరక్షణ కోసం తక్షణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
బ్రాడ్ గేజ్ గా మార్చిన తరువాతే ప్రమాదాలు..
బనర్హట్-నాగ్రకాటా రైలు మార్గం దట్టమైన అడవుల గుండా సాగుతుంది. ఇదివరకు ఈ ప్రాంతం అంతా ఏనుగుల అభయారణ్యంగా ఉండేది. నిజానికి- ఇదివరుక ఈ మార్గం అంతా మీటర్ గేజ్ గా ఉండేది. ఏనుగుల సంచారం అధికంగా ఉంటుందనే ఉద్దేశంతోనే కొన్నేళ్ల వరకూ ఈ ట్రాక్ ను మీటర్ గేజ్ గానే కొనసాగించారు. రైళ్ల రద్దీ పెరగడంతో బ్రాడ్ గేజ్ మార్చారు. బ్రాడ్ గేజ్ మార్చిన తరువాత ఏనుగుల రైలు ప్రమాదానికి గురవుతున్న సంఘటనలు చోటు చేసుకోసాగాయి. గతంలో ఇదే సెక్షన్ పరిధిలో పదుల సంఖ్యలో ఏనుగులు రైలు ఢీ కొని మృత్యువాత పడిన సందర్భాలు ఉన్నాయి.
స్పందించిన నార్తర్న్ ఫ్రాంటియర్ రైల్వే
ఈ వీడియో వెలుగులోకి వచ్చిన వెంటనే నార్తర్న్ ఫ్రాంటియర్ రైల్వే జోన్ అధికారులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఏనుగులను ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకోవడానికి తమ తరఫున అన్ని రకాల చర్యలు తీసుకున్నామని అన్నారు. ఇందులో భాగంగా- బనర్హాట్ సెక్షన్ పరిధిలో గతంలో రైళ్ల వేగాన్ని 25 కిలోమీటర్లకు కుదించామని, అయినా ప్రమాదాలు మాత్రం తప్పట్లేదని అన్నారు. గతంలో రైళ్ల వేగంపై పరిమితి ఉన్నప్పటికీ.. 2016 తరువాత దీన్ని ఎత్తేశారని ఆరోపిస్తున్నారు జంతు ప్రేమికులు. గతంలోలా రైళ్లు ఈ మార్గంలో 25 కిలోమీటర్ల వేగంతో వెళ్లట్లేదని, వేగాన్ని 50 కిలోమీటర్లకు పెంచారని విమర్శిస్తున్నారు.