మూడునెలల తర్వాత: కశ్మీర్లో రైళ్ల పునరుద్ధరణ.. తొలుత లిమిటెడ్ ట్రైన్స్...
ఎట్టకేలకు కశ్మీర్లో రైలు సేవలను పునరుద్ధరించాలని కేంద్రం నిర్ణయిచింది. అయితే కొన్ని రూట్లలో రేపటి నుంచి సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆగస్ట్ 5వ తేదీన జమ్ముకశ్మీర్కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిన సంగతి తెలిసిందే. జమ్ముకశ్మీర్, లడాఖ్ను కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. అప్పటినుంచి కశ్మీర్ లోయలో ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి.
కశ్మీర్ విభజన తర్వాత సీఆర్పీఎఫ్ బలగాల ఆధీనంలో లోయ ఉన్నది. దీంతో ఆంక్షలు కొనసాగాయి. ఇంటర్నెట్ సేవలపై కూడా ఆంక్షలు విధించారు. ఫోన్లు మూగబోయాయి. క్రమక్రమంగా స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలను ఒపెన్ చేశారు. తర్వాత ఫోన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. మంగళవారం నుంచి రైలు సేవలను యదావిధిగా అందుబాటులో ఉంచుతాయి. ఈ మేరకు ఉత్తర రైల్వే విభాగం సమాచారం అందజేసింది.
కశ్మీర్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రైళ్ల సేవలు కొనసాగుతాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. శ్రీనగర్-బారాముల్లా-శ్రీనగర్ మధ్య కొద్దిమంది ప్రయాణికులతో రెండు సర్వీసులను నడుపుతామని తెలిపారు.
కశ్మీర్ లోయలో రైళ్ల సేవలను పునరుద్ధరించే ముందు తనిఖీలు చేపట్టారు. రైల్వే ట్రాక్ను ఈ నెల 10 నుంచి చెక్ చేశారు. అంతా బాగానే ఉందని నిర్ధారించుకున్నాక ట్రయల్ కూడా చేశారు. ఆగస్ట్ 5వ తేదీ నుంచి బారాముల్లా నుంచి బనిహల్కు రైలు సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే.