ఉత్తరప్రదేశ్లో కుప్పకూలిన శిక్షణ విమానం... పైలట్ మృతి...
ఉత్తరప్రదేశ్లోని అజంఘర్ జిల్లాలో సోమవారం(సెప్టెంబర్ 21) ఓ శిక్షణ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఓ ట్రైనీ పైలట్ మృతి చెందాడు. విమానం నుంచి పారాచూట్తో కిందకు దూకి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యపడలేదు. మృతి చెందిన పైలట్ను కోణార్క్ శరణ్గా గుర్తించారు.
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం... మంజిత్ పట్టి కుషన్ ప్రాంతంలో సోమవారం ఉదయం 11.20గంటలకు విమానం కుప్పకూలింది. ఆ వెంటనే అక్కడ పేలుడు సంభవించగా... దట్టమైన పొగ కమ్ముకుపోయింది. ఎయిర్క్రాఫ్ట్ నుంచి పైలట్ పారాచూట్తో కిందకు దూకే ప్రయత్నం చేసినప్పటికీ ప్రమాదవశాత్తు మృతి చెందాడు.
విమానం కుప్పకూలిన ప్రదేశానికి 400మీ. దూరంలో పైలట్ మృతదేహాన్ని గుర్తించారు. ప్రమాద అనంతరం స్థానికులు అక్కడ పెద్ద ఎత్తున గుమిగూడారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విమానం ఉత్తరప్రదేశ్లోని మౌ నుంచి అదే రాష్ట్రంలోని అమేథీలో ఉన్న ఇందిరాగాంధీ నేషనల్ ఫ్లైట్ అకాడమీకి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ప్రమాదానికి గురైన ఎయిర్క్రాఫ్ట్ ఫోర్ సీటర్ అని... ప్రమాద సమయంలో పైలట్ ఒక్కడే అందులో ఉన్నాడని నిర్దారించారు.
A TB 20 aircraft flown by a trainee pilot from the Indira Gandhi Rashtriya Uran Akademi (IGRUA), crashed today in the Azamgarh district. The pilot died in the accident. pic.twitter.com/wqMgeap0YX
— ANI UP (@ANINewsUP) September 21, 2020
ఈ ఏడాది జూన్లో ఒడిశాలోనూ ఓ ఎయిర్క్రాఫ్ట్ కుప్పకూలింది. ఢెంకనల్ జిల్లాలోని బిరసల్ వైమానిక స్థావరంలో జరిగిన ఈ ప్రమాదంలో ఓ పైలట్ సహా శిక్షణలో ఉన్న ఓ యువతి మృతి చెందారు. మృతులను కెప్టెన్ సంజీబ్ కుమార్ ఝా, తమిళనాడుకు చెందిన అనీషా ఫతీమాలుగా గుర్తించారు.