తృటిలో తప్పిన విమాన ప్రమాదం..రెక్క విరగడంతో హైవేపై ల్యాండింగ్
ఘజియాబాద్: ఉత్తర్ ప్రదేశ్లో విమానప్రమాదం తృటిలో తప్పింది. ఎన్సీసీకి చెందిన ట్రైయినింగ్ ఎయిర్క్రాఫ్ట్ ఘజియాబాద్ హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. విమానం టేకాఫ్ తీసుకున్న కాసేపటికే సాంకేతికలోపం తలెత్తడంతో విమానం హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్లు సమాచారం. విమానంపై ఉన్న లోగోను బట్టి ఈ విమానం నేషనల్ కాడెట్ కార్ప్స్కు చెందినదిగా తెలుస్తోంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవడం వల్ల విమానం యొక్క రెక్క ధ్వంసమైంది. విమానం ల్యాండ్ అయ్యిందన్న విషయం తెలుసుకున్న ఇండియన్ ఎయిర్ఫోర్స్ సిబ్బంది వెంటనే విమానం దగ్గరకు వెళ్లి అందులోని పైలట్లను బయటకు తీసుకొచ్చారు.
Ghaziabad: An aircraft made an emergency landing at Eastern Peripheral Expressway near Sadarpur village today, after it faced a technical problem. pic.twitter.com/ALRTCquHGA
— ANI UP (@ANINewsUP) January 23, 2020
పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు ఈ విమానం ఉపయోగిస్తామని అధికారులు చెప్పారు. సాంకేతికలోపం తలెత్తడంతోనే విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు. విమానం ఘజియాబాద్లోని సదర్పూర్ మీదుగా వెళ్లే ఎక్స్ప్రెస్వే పై ల్యాండ్ అవడంతో విమానంను చూసేందుకు పెద్దఎత్తున ఆ గ్రామ ప్రజలు వచ్చారు. ఇదిలా ఉంటే పైలట్లకు సురక్షితంగా ప్రాణాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కొన్ని సందర్భాల్లో హైవేలు కూడా రన్వేలా ఉపయోగపడేలా ప్రత్యేకంగా తీర్చి దిద్దడం జరిగింది. విమానాలు టేకాఫ్ తీసుకోగానే ఏదైనా అనుకోని పరిస్థితి తలెత్తితే ఈ హైవేలపై ల్యాండ్ అయ్యేలా కొన్నిటిని ప్రభుత్వం గుర్తించింది. మిలటరీ విమానాలు లేదా ఇతర చిన్న విమానాలు ల్యాండ్ అయ్యేలా తీసుకున్నారు. గతంలో యుమునా ఎక్స్ప్రెస్వే పై ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన ఫైటర్ జెట్ ల్యాండ్ అయ్యింది. వాతావరణం అనుకూలించకపోవడంతో 2013లో కూడా ఓ బిజినెస్ మ్యాన్కు చెందిన నాలుగు సీట్ల ప్రైవేట్ విమానం మధ్యప్రదేశ్లోని బీటల్ హైవేపై ల్యాండ్ అయ్యింది.