ప్రయాణికులకు చేదువార్త: మే 3 తరువాతైనా రైళ్ల, విమానాలపై డౌట్: గడువు పెంపు దిశగా కేంద్రం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా 19 రోజుల రెండోదశ లాక్డౌన్ కొనసాగుతోంది. దేశ ప్రజలు స్వీయ గృహ నిర్బంధంలో ఉంటున్నారు. ప్రయాణ సాధనాలేవీ అందుబాటులో లేకపోవడం వల్ల ఎక్కడివారు అక్కడే తలదాచుకుంటున్నారు. 21 రోజుల తొలిదశ ముగిసిన తరువాత లాక్డౌన్ ఎత్తేస్తారని భావించినప్పటికీ.. వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటోంది. మెజారిటీ ప్రజలు ఊహించినట్లే లాక్డౌన్ను వచ్చేనెల 3వ తేదీ వరకు పొడిగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.
మే 3న ఛాన్స్ లేనట్టే..
ఈ నెల 20వ తేదీ తరువాత కొంతమేర సడలింపులను ఇచ్చినప్పటికీ.. అవి పరిమితమే. ప్రజా రవాణాలో ఎలాంటి మార్పులు కూడా చేయలేదు. కేంద్రం ఇచ్చిన సడలింపుల్లో బస్సులు, రైళ్లు, విమాన సర్వీసులకు మినహాయింపు ఇవ్వలేదు. ఫలితంగా- ఇక అందరి దృష్టీ వచ్చేనెల 3వ తేదీపై నిలిచింది. రెండోదశ లాక్డౌన్ ముగిసిన తరువాతనైనా ప్రయాణ సాధనాలు అందుబాటులోకి వస్తాయని ఆశించే వారి సంఖ్యకు లెక్కేలేదు.
నీళ్లు చల్లుతోన్న కేంద్రం..
అలాంటి ఆశావహులపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లబోతున్నట్టే కనిపిస్తోంది. రెండోదశ లాక్డౌన్ తరువాత కూడా దేశంలో రైళ్లు, విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేనట్టేనని తెలుస్తోంది. రైల్వే, పౌర విమానయాన మంత్రిత్వ శాఖల అధికారులు తాజాగా చేసిన ప్రకటన ఈ అనుమానాలకు మరింత బలాన్ని ఇస్తోంది. రైళ్లు, విమాన సర్వీసులను పునరుద్ధరించడానికి అవసరమైన ప్రణాళికలేవీ ప్రస్తుతం తమ పరిశీలనలో లేవని తేల్చి చెబుతున్నారు.
మే 15 తరువాతే..
రైళ్లు, విమాన సర్వీసుల సర్వీసులపై విధించిన లాక్డౌన్ నిషేధాన్ని ఇప్పట్లో ఎత్తేసే అవకాశాలు కూడా లేవని కుండబద్దలు కొడుతున్నారు. ఈ విషయాన్ని పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురీ వెల్లడించారు. మే 15వ తేదీ తరువాతే వాటిని పునరుద్ధరించవచ్చని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన న్యూఢిల్లీలో నిర్వహించిన కేంద్రమంత్రుల ఉప సంఘం సమావేశంలో దీనిపై ఓ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు.
ప్రధానిదే తుది నిర్ణయం..
దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్యలో కనిపించే మార్పుల ఆధారంగా తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవడానికి అవకాశం ఉందని అన్నారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తుది నిర్ణయాన్ని తీసుకుంటారని చెప్పుకొచ్చారు. మే 3వ తేదీ తరువాత దేశంలో కరోనా వైరస్ తీవ్రతను ఆధారంగా చేసుకుని రైళ్లు, విమాన సర్వీసుల గడువును 15వ తేదీ నుంచి తగ్గించడమో, లేదా పొడిగించడమో చేస్తామని, దీనికి సంబంధించిన సూచనలతో కూడిన నివేదికను ప్రధానికి అందిస్తామని అన్నారు.
Recommended Video