రైలు టికెట్ల జారీలో సడన్ ట్విస్ట్: వెయిటింగ్ లిస్ట్ ఉంటే ఏం చేయాలి? తత్కాల్ టికెట్లపై
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా నాలుగోదశ లాక్డౌన్ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే నెల 1 నుంచి రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. తొలిదశలో 200 రైళ్లను నడిపించబోతున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఇదివరకే వెల్లడించింది. దేశంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతున్నప్పటికీ.. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రైళ్ల రాకపోకలకు అనుమతి ఇచ్చింది. ఆయా రైళ్ల టికెట్ల బుకింగ్ ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది.
Recommended Video
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో కేంద్రం జోక్యం: ఉన్నపళంగా జగన్ సర్కార్ నిర్ణయం వెనుక
టికెట్ల జారీలో అనేక మార్పులు..
ఒకేసారి వందల సంఖ్యలో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చగల సామర్థ్యం రైళ్లకు ఉంది. సాధారణంగా రైళ్లన్నీ కిటకిటలాడుతుంటాయి. వచ్చే నెల 1వ తేదీ నుంచి పట్టాలెక్కబోతోన్న 200 రైళ్లల్లో ఈ తరహా వాతావరణం కనిపించదు. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందడాన్ని అడ్డుకోవడంలో భాగంగా.. రైళ్లల్లో ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి టికెట్ల బుకింగ్లో భారీ మార్పులను చేసింది. ఈ మార్పులతోనే టికెట్లు బుకింగ్ ప్రారంభం కానుంది.. కాస్సేపట్లో.
ఆన్లైన్ టికెట్లు ఉంటేనే..
ఏజెంట్ల ద్వారా జారీ చేసే టికెట్లు చెల్లవని రైల్వే అధికారులు వెల్లడించారు. రైల్వే లేదా ఐఆర్సీటీసీ ఏజెంట్లు జారీ చేసిన టికెట్లపై కూడా ప్రయాణాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న టికెట్లను మాత్రమే అనుమతిస్తామని, అలాంటి వాటిపై మాత్రమే ప్రయాణించవచ్చని తేల్చి చెప్పింది. ఏజెంట్ల ద్వారా జారీ చేసిన టికెట్లపై ప్రయాణాన్ని తాత్కాలికంగా నిషేధించినట్లు స్పష్టం చేసింది.
తత్కాల్.. కరెంట్ బుకింగ్లపైనా
రైలు బయలుదేరే చివరి రెండు గంటల వరకు కూడా టికెట్లను కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న తత్కాల్ వ్యవస్థను ప్రస్తుతానికి పక్కన పెట్టేశారు రైల్వే అధికారులు. తత్కాల్, ప్రీమియం తత్కాల్ ద్వారా టికెట్లను జారీ చేయబోవట్లేదని వెల్లడించారు. కరెంట్ బుకింగ్ కూడా అందుబాటులో ఉండబోదని తెలిపారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాతే.. వాటిని పునఃప్రారంభించే అవకాశం ఉందని వెల్లడించారు.
దివ్యాంగులు, పేషెంట్లకు మాత్రమే రాయితీ..
రైలు ప్రయాణికులకు వివిధ కేటగిరీల కింద కల్పించే రాయితీలను కూడా ప్రస్తుతానికి ఎత్తేసినట్లు అధికారులు వెల్లడించారు. దివ్యాంగులు, 11 కేటగిరీలకు చెందిన పేషెంట్లకు మాత్రమే ప్రయాణంలో రాయితీ లభిస్తుందని స్పష్టం చేశారు. జర్నలిస్టు పాసులు, సీనియర్ సిటీజన్ కన్సెషన్స్, నెలవారీ పాసులు వంటి సాధారణ రాయితీలన్నింటినీ తాత్కాలికంగా రద్దు చేశారు. వాటిని ఎప్పుడు పునరుద్ధరించేదీ తరువాత వెల్లడిస్తామని అన్నారు.
వెయిటింగ్ లిస్ట్లో ఉంటే..
వెయిటింగ్ లిస్ట్లో ఉండే ప్రయాణికులు తమ నంబర్ వచ్చేంత వరకూ సాధారణ బోగీల్లో వెళ్తుండటం సహజం. ఇకపై ఆ తరహా వ్యవస్థ ఉండదు. ఇది తాత్కాలికమే. వెయిటింగ్ లిస్ట్లో ఉండే టికెట్లు రద్దు అవుతాయి. ఈ లిస్ట్లో ఎలాంటి సీరియల్ నంబర్ ఉన్నా.. రైలు ఎక్కడానికి అవకాశం కల్పించట్లేదు అధికారులు. వెయిటింగ్ లిస్ట్లో ఉండే టికెట్లు రద్దు అయినట్లుగానే భావించాల్సి ఉంటుందని, వారికి రీఫండ్ చెల్లిస్తామని అధికారులు తెలిపారు. సాధారణ బోగీలను అందుబాటులోకి తీసుకుని రాకపోవడం వల్లే వెయిటింగ్ లిస్ట్లో ఉండే వారికి ప్రయాణ సౌకర్యాన్ని కల్పించట్లేదని తెలిపారు.