కార్డాన్ సెర్చ్.. ఇంట్లో దాగి ఉండగా.. పుల్వామా ఉగ్రవాదదాడి సూత్రధారి హతం!
శ్రీనగర్: పుల్వామా ఉగ్రవాద దాడిలో 40 మందికి పైగా జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాద సంస్థ దీనికి బాధ్యులుగా ప్రకటించుకుంది. ఈ దాడికి కారణమైన మరో కీలక ఉగ్రవాది దక్షిణ కాశ్మీర్లోని త్రాల్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారులు సోమవారం తెలిపారు. ఈ ఎన్కౌంటర్ పథక రచనలో ఈ ఉగ్రవాది కీలక పాత్ర పోషించాడు. అతని పేరు ముదాసిర్ అహ్మద్ ఖాన్.
సర్జికల్ స్ట్రైక్స్: బాలాకోట్లోకి మీడియాను ఎందుకు రానివ్వట్లేదు, అక్కడ అసలేం జరుగుతోంది?
ఇంటెలిజెన్స్ సమాచారం
త్రాల్లోని పింగ్లిష్ ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాది ముదాసిర్ అహ్మద్ ఖాన్ అలియాస్ మహ్మద్ భాయ్ హతమై ఉంటాడని విశ్వసిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పింగ్లిష్ ప్రాంతంలో టెర్రరిస్టులు సంచరిస్తున్నారనే ఇంటెలిజెన్స్ సమాచారంతో ఆదివారం కార్డాన్ సెర్చ్ చేపట్టారు. తనిఖీలు జరుపుతుండగా ఓ ఇంట్లో దాగి ఉన్న ఉగ్రవాదులు... భద్రతాబలగాల పైకి కాల్పులు జరిపారు. ఎదురు కాల్పులు జరిపిన మన సైన్యం ముగ్గురు జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఎన్కౌంటర్లో ఉగ్రవాదుల మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమయ్యాయి.
పుల్వామా దాడికి అన్ని ఏర్పాట్లు
ముగ్గురు హతుల్లో ఒకడిని ముదాసిర్ అహ్మద్ఖాన్గా భావిస్తున్నారు. పుల్వామా దాడికి అహ్మద్ కీలక సూత్రధారిగా వ్యవహరించాడు. పుల్వామా దాడిపై ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో అహ్మద్ ఖాన్ గురించి అనేక విషయాలు వెలుగు చూశాయని చెబుతున్నారు. పుల్వామా దాడికి పేలుడు పదార్థాలను, వాహనాన్ని ఏర్పాటు చేసింది కూడా అహ్మద్ ఖానే.
సూసైడ్ బాంబర్తో సంప్రదింపులు
త్రాల్లోని మిర్ మొహల్లాకు చెందిన అహ్మద్ ఖాన్ డిగ్రీ పూర్తి చేశాడు. ఎలక్ట్రీషియన్గా ఐటీఐలో డిప్లొమా కోర్స్ చేశాడు. ఉగ్రవాదానికి ప్రేరేపితుడయ్యాడు. 2017లో జైష్ ఏ మహ్మద్ సంస్థలో చేరాడు. మొదట గ్రౌండ్ వర్కర్గా పని చేసిన అతను 2018 నుంచి జైష్ ఏ మహ్మద్లో క్రియాశీలకంగా వ్యవహరించడం ప్రారంభించాడు. ఇటీవల పుల్వామా దాడిలో ఆత్మాహుతి చేసుకున్న అదిల్ అహ్మద్ దార్.. దాడికి ముందు ఇతనితో చాలా రోజుల పాటు సంప్రదింపులు జరిపాడు.