బెంగాల్లో దారుణం: సామూహిక దాడిలో ట్రాన్స్జెండర్ మృతి..దాడి ఎందుకు చేశారు?
కోల్కతా: వెస్ట్ బెంగాల్లో దారుణం చోటుచేసుకుంది. చిన్నపిల్లలను ఎత్తుకెళుతున్నారని చెప్పి ట్రాన్స్జెండర్పై స్థానికులు దాడి చేశారు. ఈ ఘటన జల్పాయిగురి జిల్లాలో చోటుచేసుకుంది. చిన్నపిల్లలను ఎత్తుకెళుతున్నారని ఓ ట్రాన్స్జెండర్ను స్థానికులు చితకబాదారు. తీవ్రగాయాలపాలైన ట్రాన్స్ జెండర్ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. ఇక ట్రాన్స్ జెండర్ను చితకబాదుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నాగ్రకత గ్రామంకు చెందిన వారు ఈ ట్రాన్స్జెండర్ పిల్లలు ఎత్తుకుపోయేవారని భావించి చితకబాదినట్లు పోలీసులు తెలిపారు.
ఇక ట్రాన్స్జెండర్ గ్రామంలో కనిపించగానే రైల్వే స్టేషన్ వరకు తరిమి తరిమి కొట్టారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఆ తర్వాత ట్రాన్స్జెండర్ తలపై రాళ్లతో దాడి చేశారు.దాడి దృశ్యాలను కొందరు తమ సెల్ఫోన్లలో బంధించారు. కాళ్లతో, కట్టెలతో ట్రాన్స్ జెండర్ పై దాడి చేస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. అప్పటికే రక్తపు మడుగులో పడి ఉన్న ట్రాన్స్ జెండర్ను చికిత్స కోసం తరలిస్తామన్న ఆలోచన ఎవరూ చేయలేదు. తనను కొట్టొదంటూ ట్రాన్స్ జెండర్ వేడుకుంటున్న దృశ్యాలు అందులో రికార్డ్ అయ్యాయి.
ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆమెను హాస్పిటల్కు చికిత్స కోసం తరలించారు.చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనను పోలీస్ అధికారి దేబాషిష్ చక్రబర్తి ఖండించారు. అయితే జిల్లాలో ఇప్పటి వరకు పిల్లలను ఎత్తుకెళ్లినట్లు ఎవరూ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. అయితే తప్పుడు వార్తలు ప్రచారంలో ఉండటంతో వాటిని నమ్మిన స్థానికులు ఈ ట్రాన్స్ జెండర్పై దాడి చేసి చంపేశారని చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటి వరకు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.