తాళి కట్టు శుభవేళ: హిజ్రాల పెళ్లి సందడి
చెన్నై: హిజ్రాలు తాళి కట్టించుకుని పెళ్లి సందడి చేస్తూ ఆనందోత్సవాలు నిర్వహించుకున్న సంఘటన తమిళనాడులో జరిగింది. తమిళనాడులోని విల్లుపురం జిల్లా ఉలందూర్ పేట సమీపంలోని కూత్తాండవర్ ఆలయంలో హిజ్రాలు పెళ్లి చేసుకుని సంతోషంతో కేరింతలు వేశారు.
ఆలయ పూజార్ల చేతులు మీదుగా హిజ్రాలు మెడలో తాళి కట్టించుకున్నారు. కూవాగం గ్రామంలోని కూత్తాండవర్ ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాలు హిజ్రాలకు ఓ వసంతోత్సవం. ఇక్కడి వేడుకలకు మహాభారత యుద్ధగాధ ముడిపడి ఉన్నట్లు పురాణాలు చెబుతున్న విషయం తెలిసిందే.
ఈ ఉత్సవాల్లో ముఖ్య ఘట్టం హిజ్రాల పెళ్లి సందడి. ఈ పెళ్లి సందడికి దేశ, విదేశాల నుంచి వేలాధి మంది హిజ్రాలు తరలివస్తారు. ఎటు చూసినా, ఎక్కడ చూసినా హిజ్రాల సందడే. లాడ్జీలు, గెస్టు హౌస్ లు హిజ్రాలతో నిండిపోయాయి.
అందగత్తెలకు తామేమి తక్కువ కాదు అంటూ అందంగా సింగారించుకుని సందడి చేస్తున్నారు. హిజ్రాల సందడితో ఆలయం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేశారు. కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ర్ట తదితర రాష్ర్టాలతో పాటు విదేశాల నుంచి హిజ్రాలు తరలి వచ్చారు.
మంగళవారం సాయంత్రం నుంచి పెళ్లి కుమార్తెలుగా ముస్తాబైన హిజ్రాలు కూత్తాండవర్ ఆలయం వద్దకు చేరుకున్నారు. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత ఆలయ పూజార్ల చేతులు మీద హిజ్రాలు వారి మెడలో తాళి కట్టించుకుని మురిసిపోయారు.
విల్లుపురంలో జరిగిన మిస్ కూ వాగం -2016 పోటీల్లో సేలంకు చెందిన గాయిత్రీ కిరీటాన్ని సొంతం చేసుకుంది. రెండవ స్థానంలో మలేషియాకు చెందిన భవాని, మూడవ స్థానాన్ని చెన్నైకి చెందిన ఖుషి కైవసం చేసుకున్నారు. హిజ్రాలకు అందాల పోటీలు, నాట్య పోటీలతో పాటు వివిధ రకాల పోటీలు నిర్వహించారు.