నోరు జారింది: కుష్బుపై హిజ్రాలకు ఎందుకంత కోపం?
చెన్నై: ప్రముఖ నటి, కాంగ్రెస్ మహిళా నేత కుష్బు చేసిన వ్యాఖ్యలపై హిజ్రాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కుష్బు ప్రస్తుతం కాంగ్రెస్ జాతీయ సమాచార ప్రతినిధిగా ఉన్నారు. ఎన్నికల్లో భాగంగా ఆమె ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో ఎన్నికల్లో పోటీ చేయడంపై హిజ్రాలు పున:పరిశీలన చేసుకోవాలని అన్నారు.
అంతేకాదు త్వరలో తమిళనాడులో జరగనున్న ఎన్నికల్లో హిజ్రాలు పోటీ చేయాలని ఆశపడటం సమంజసం కాదని, తమకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా? లేదా? అనే విషయంపై వారు ఆలోచించుకుంటే మంచిదని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై హిజ్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెన్నైలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం చుట్టుముట్టి సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హిజ్రాలు మాట్లాడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
నార్త్ ఇండియాకు చెందిన కుష్బు గత కొన్నేళ్లుగా తమిళనాడుకు చెందన మహిళల శీలాన్ని కించపరిచే విధంగా మాట్లాడారని గుర్తు చేశారు. తాజాగా ఇప్పుడు హిజ్రాల విషయంలో అదేవిధంగా ఆవేదన కలిగించిందని పేర్కొన్నారు.
నటి కుష్బు నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని సలహా ఇచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు తమకు ఉందని ఈ సందర్భంగా హిజ్రాలు స్పష్టం చేశారు.