బస్సులు నడవక ప్రయాణీకుల ఇక్కట్లు: కిక్కిరిసిన ఆటోలు, మెట్రో రైళ్లు
న్యూఢిల్లీ: మోటారు వాహనాల సవరణ బిల్లు 2017కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వివిధ రకాల వాహనాదారులు సమ్మె చేస్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు తిరగడం లేదు. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చాలాచోట్ల బస్సులతో పాటు లారీలు, ఆటోలు, క్యాబ్లు, ఇతర ప్రయివేటు వాహనాలు కూడా తరగడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో బస్సులు అన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి.
కేంద్రం ప్రతిపాదించిన మోటారు వాహనాల సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజారవాణా సంస్థలు ఒకరోజు (మంగళవారం) సమ్మెలో పాల్గొనాలని తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. విధులను బహిష్కరించాలని అధిక శాతం కార్మిక సంఘాలు నిర్ణయించటంతో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచాయి.
కార్మికుల విధుల దూరంగా ఉండనున్నారు. అధికారిక కార్మిక సంఘం కూడా సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించిన నేపథ్యంలో బస్సులు నడిచే అవకాశం లేదని అధికారులు కూడా చెబుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి సిటీ బస్సుల మొదలు దూరప్రాంతాలకు వెళ్లే బస్సులను ముందు జాగ్రత్తగా నిలిపి వేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.
తిరిగి మధ్యాహ్నం లేదా సాయంత్రం నుంచి సర్వీసులు నడిచే అవకాశముందని భావిస్తున్నారు. బస్సులు పూర్తిగా బంద్ కావడంతో హైదరాబాద్ వంటి పలుచోట్ల ఆటోలు, ఇతర ప్రయివేటు వాహనాలు కిక్కిరిసిపోయాయి.
కాగా, ఈ కొత్త వాహనాల చట్టం వాహన యజమానులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని పలు సంఘాలు ఆరోపిస్తున్నాయి. హైదరాబాద్తో పాటు న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై తదితర నగరాల్లోను ఇదే పరిస్థితి ఉంది. మెట్రో, లోకల్ రైళ్ల సేవలు కొనసాగుతున్నాయి. అవి కిక్కిరిసిపోయాయి.