బోరుబావిలో పడ్డ రెండేళ్ల సుజిత్ కన్నుమూత: కుళ్లిన స్థితిలో..!
Recommended Video
చెన్నై: రెండేళ్ల సుజిత్ విల్సన్ ఇక లేడు. తిరిగి రాడు. 150 అడుగుల లోతులో ఉన్న బోరుబావిలో పడిన సుజిత్ కన్నుమూశాడు. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో సుజిత్ బోరుబావిలో పడగా.. మంగళవారం తెల్లవారు జామున 3.45 నిమిషాల సమయంలో మృతదేహాన్ని వెలికి తీశారు.. కుళ్లిపోయిన స్థితిలో. సుజిత్ బోరుబావిలో పడినప్పటి నుంచి ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఆ బాలుడిని కాపాడటానికి చేసిన ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇవ్వలేదు. సుజిత్ క్షేమంగా తిరిగి రావాలంటూ తమిళనాడు ప్రజలు చేసిన ప్రార్థనలు ఫలించలేదు.
80 గంటల పాటు శ్రమించినా..
సుజిత్ మరణించిన విషయాన్ని తమిళనాడు భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ జే రాధాకృష్ణన్ ధృవీకరించారు. ఈ తెల్లవారు జామున 3:45 నిమిషాల సమయంలో సుజిత్ మృతదేహం లభ్యమైందని, కుళ్లిపోయిన స్థితిలో ఉందని తెలిపారు. సుజిత్ చిక్కుకుని ఉన్న ప్రదేశం సమీపానికి చేరుకున్న తరువాత సహాయక సిబ్బంది.. దుర్వాసనను పసిగట్టారని అన్నారు. భూ ఉపరితలం నుంచి 88 అడుగుల లోతులో సుజిత్ మృతదేహం లభ్యమైందని చెప్పారు. 75 నుంచి 80 గంటల పాటు నిరంతరాయంగా చేసిన ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇవ్వలేదని రాధాకృష్ణన్ అన్నారు.
ఓఎన్జీసీ, ఐఐటీ, ఎన్ఐటీ నిపుణులు సైతం..
సుజిత్ ను సజీవంగా వెలికి తీయడానికి తమిళనాడు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. సుజిత్ చిక్కుకున్న ప్రదేశాన్ని చేరుకోవడానికి శరవేగంగా సమాంతర గొయ్యిని తీయడానికి నవరత్న కంపెనీలను రప్పించింది. బొగ్గు తవ్వకాల్లో అపార అనుభవం ఉన్న నైవేలి లిగ్నైట్ కంపెనీ (ఎన్ఎల్సీ), చమురు, సహజవాయువులను వెలికితీసే ఓఎన్జీసీ; ఎల్ అండ్ టీ వంటి సంస్థలకు చెందిన హైస్పీడ్ డ్రిల్లింగ్ యంత్రాలను ఉపయోగించింది. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటీ-మద్రాస్ నిపుణుల సహకారాన్ని తీసుకుంది.
40 అడుగుల లోతులో భారీ బండరాళ్లు..
భూమిని 40 అడుగుల లోతు మేర తవ్విన తరువాత.. భారీ పరిమాణంలో బండరాళ్లు రావడం వల్ల సకాలంలో సుజిత్ ను చేరుకోలేకపోయామని చెబుతోంది ప్రభుత్వం. బండరాళ్లు ఎదురైన తరువాత వాటిని తొలవడానికి చాలా సమయం పట్టింది. 10 అడుగుల లోతు గొయ్యిని తవ్వడానికి 15 గంటలు పట్టిందని సహాయక సిబ్బంది వెల్లడించారు. బండరాళ్లు ఎదురైన తరువాత తవ్వకం పనులు దాదాపు స్తంభించిపోయినట్టయిందని చెప్పారు. వాటిని పగులగొట్టడానికి ప్రత్యేక సామాగ్రిని వినియోగించాల్సి వచ్చిందని చెప్పారు. బోరుబావి పూర్తిగా మూసుకునిపోయే ప్రమాదం ఉండటం వల్ల జిలెటిన్ స్టిక్స్ ను వినియోగించలేదని అన్నారు.
తొలుత.. 25 అడుగుల లోతులో..
తిరుచిరాపల్లి జిల్లా మనప్పారై సమీపంలోని నడుకట్టుపట్టికి చెందిన ఆరోగ్య రాజ్, కళైమణి రెండో కుమారుడు సుజిత్. తన తండ్రికి చెందిన మొక్కజొన్న పొలంలో ఆడుకుంటూ సుమారు 150 అడుగుల లోతున ఉన్న బోరుబావిలో పడిపోయాడు. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రారంభంలో 25 అడుగుల లోతులో చిక్కుకునిపోయాడు. క్రమంగా 60 అడుగులు, అనంతరం 88 అడుగుల లోతు దిగువకు జారిపోయాడు.
తమిళనాడులో విషాద ఛాయలు
సుజిత్ ఇక లేడనే విషయం తెలిసిన వెంటనే తమిళనాడులో విషాదఛాయలు నెలకొన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సహా కోలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు సుజిత్ క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థించారు. వారి ప్రార్థనాలు ఫలించలేదు. సుజిత్ నిర్జీవుడై తిరిగి రావడం కలిచి వేసిందని వ్యాఖ్యానిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, పలువురు మంత్రులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. డీఎంకే చీఫ్ స్టాలిన్ సహా ఆ పార్టీ నేతలు పలువురు ఆరోగ్యరాజ్ తో మాట్లాడారు.