200 అడుగుల లోయలో జారిపోతూ..చెట్లకు చిక్కుకున్న బస్సు: తృటిలో తప్పిన ప్రమాదం
సూరత్: గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది. 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి లోయలోకి జారిపడబోయింది. ఆ సమయంలో చెట్లు అడ్డుగా రావడంతో పెను ప్రమాదం తప్పింది. జీజే 04 జడ్ 0933 నంబర్ గల బస్సు మహారాష్ట్రలోని షిర్డీ నుంచి గుజరాత్ లోని సూరత్ కు బయలుదేరింది. సుమారు 70 మంది పర్యాటకులు బస్సులో ఉన్నారు. వారిలో పలువురు మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారు. షిర్డీ సాయినాథున్ని దర్శించుకున్న అనంతరం వారంతా స్వస్థలమైన సూరత్ కు బయలుదేరారు.
బస్సు మార్గమధ్యలో గుజరాత్-మహారాష్ట్ర సరిహద్దుల్లోని సాపుతారా-మాలేగావ్ ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. మలుపులో బస్సు సరిగ్గా తిరగకపోవడం వల్ల డ్రైవర్ రివర్స్ తీసుకుంటున్న సమయంలోరోడ్డు మీది నుంచి లోయలోకి జారింది. ఆ సమయంలో సంఘటనాస్థలంలో చెట్లకు తట్టుకుని బస్సు నిలిచిపోయింది.
వెంటనే- ప్రయాణికులు బస్సు నుంచి సురక్షితంగా కిందికి దిగారు. ఈ ఘటనలోొ కొందరు ప్రయాణికులకు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. బస్సులోని వారంతా ఒకే కుటుంబానికి చెందిన బంధు, మిత్రులుగా తేలింది. వారంతా ఓ శుభకార్యానికి హాజరు కావడానికి షిర్డీ వెళ్లి, తిరిగి సూరత్ కు వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.