రక్షణ కల్పించండి: సుప్రీంకోర్టుకు అయోధ్య-మసీదు కేసు ట్రయల్ జడ్జీ
న్యూఢిల్లీ: అయోధ్య-మసీదు కేసు విచారిస్తున్న ఓ న్యాయమూర్తి తనకు రక్షణ కల్పించాలంటూ సుప్రీంకోర్టును కోరారు. దీంతో సుప్రీంకోర్టు వెంటనే స్పందించింది. సదరు న్యాయమూర్తి విన్నపాన్ని పరిశీలించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు వారాల్లోగా స్పందన తెలియజేయాలని పేర్కొంది.
స్పెషల్ జడ్జీ సురేంద్ర కుమార్ యాదవ్ను 2017లో సుప్రీంకోర్టు నియమించింది. రెండేళ్లలో డే-టు-డే విచారణ జరిపి కేసును కొలిక్కి తేవాలని సూచించింది. 25ఏళ్లపాటు కేసును సాగదీయడంపై సుప్రీంకోర్టు సీబీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
బీజేపీ సీనియర్ నాయకులు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతితోపాటు మరో 10మందిపై మోపబడ్డ నేరపూరిత కుట్ర ఆరోపణలపై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరుపుతోంది.
ఇది ఇలా ఉండగా, అయోధ్యలో రామమందిరం నిర్మాణం చేపడితే తాను బంగారు ఇటుక సమర్పించుకుంటానని మొఘల్ వంశ వారసుడు ప్రిన్స్ యాకుబ్ హబీముద్దీన్ తుసి అన్నారు. మసీదు నిర్మించడం కోసం అక్కడున్న మందిరాన్ని కూల్చారని ఆయన అన్నారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో రామాలయం నిర్మిస్తే తాను పూర్తిగా సహకరిస్తానని అన్నారు. రామాలయం ఉన్న ప్రాంతం తమ పెద్దలకు చెందినదని, ఆ భూమిపై తనకు హక్కు కల్పిస్తే.. అంతా రామాలయానికే రాసిస్తానన్నాడు.
'1529 సంవత్సరంలో ఆ మసీదు నిర్మించబడింది. అది కూడా ఆర్మీ, కమాండోల కోసం నిర్మించింది కాబట్టి.. అది ప్రైవేట్ ప్రాపర్టీనే. మేము ఆ భూమికి న్యాయబద్ధమైన యజమానులం. అంతేగాక, 2005లో సుప్రీంకోర్టు కూడా తాను షాజహాన్ మనవడినని అంగీకరించింది' అని ప్రిన్స్ యాకుబ్ వివరించారు.