యూపీ అనాలిసిస్: ముక్కోణపు పోటీతో బీజేపీకి అనుకూలంగా మారుతుందా...?
సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. ఇక కేంద్రంలో ప్రభుత్వాన్ని డిసైడ్ చేయడంలో కీలకంగా వ్యవహరించే రాష్ట్రాల్లో ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమైనదిగా చెప్పొచ్చు. యూపీలో 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అక్కడ ఇప్పటికే ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న ఎస్పీ బీఎస్పీ ఒక్కటయ్యారు. అప్పటి వరకు సునాయాసంగా మెజార్టీ స్థానాలు గెలుస్తామని భావించిన కమలం పార్టీకి ఈ రెండు బద్ధ శత్రువులు ఒక్కటవడంతో కరెంట్ షాక్ తగిలినట్లయ్యింది. ఇక కాంగ్రెస్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇలా ఉత్తర్ ప్రదేశ్లో ముక్కోణపు పోటీ ఉండగా బీజేపీ ఏమేరకు నెగ్గుకురాగలదు..?
నరాల్లో ప్రవహించేది భారతీయ రక్తమైతే ఎవరూ దాడులపై ప్రశ్నించరు: విపక్షాలపై మోడీ ఫైర్
నాడు యూపీని ఏలిన కాంగ్రెస్...పార్టీల పొత్తులతో మరుగున పడింది
2019 లోక్సభ ఎన్నికలకు పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఆదివారం ఎన్నికల సంఘం ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల చేయడంతో పార్టీలు ప్రచారాల దూకుడును పెంచాయి. ఇక కేంద్రంలో కీలకంగా వ్యవహరించే ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో 2014 ఎన్నికల్లో 80 స్థానాలకు గాను బీజేపీ 71 స్థానాలతో విజయఢంకా మోగించింది. ఈసారి ఎస్పీ బీఎస్పీలు జతకట్టడంతో బీజేపీ ఈ స్థాయిలో సీట్లు గెలవడం కష్టంగానే కనిపిస్తోంది. ఎస్పీ బీఎస్పీలు పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి దిగిన పక్షంలో కచ్చితంగా అది కమలం పార్టీకి కలిసొచ్చేదని వ్యతిరేక ఓట్లు ఈ రెండు పార్టీలకు వెళ్లే అవకాశం ఉన్నిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ఈ సారి పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఇక 1990 కంటే ముందు యూపీని వరుసగా కాంగ్రెస్ పరిపాలించింది. ఆ సమయంలో సోషలిస్టు పార్టీల మధ్య విబేధాలు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఇక 1969లో విపక్షాలు కలిసి పోటీలోకి దిగినప్పుడు భారతీయలోక్దళ్ అత్యధిక స్థానాలు గెలిచింది. 1977లో జనతా పార్టీ 1989లో జనతాదల్ పార్టీలు మెజార్టీ స్థానాలు గెలిచాయి. ఇక్కడ కాంగ్రెస్కు ఎదురుగాలే వీచింది.
బీజేపీకి చెక్ పెడితేనే రాష్ట్రంలో ఎస్పీ బీఎస్పీల మనుగడ..?
2014 సార్వత్రిక ఎన్నికలు, 2017లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన తర్వాత ముందుగా కమలం పార్టీకి చెక్ పెడితేనే రాష్ట్ర రాజకీయాల్లో తమ మనుగడ సాగుతుందని ఎస్పీ, బీఎస్పీ పార్టీలు గ్రహించాయి. ఇక అప్పటి వరకు సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీల మధ్య ఉన్న విబేధాలు పక్కకు బెట్టి ఇద్దరు మిత్రులుగా మారారు. ఇక ఈసారి పొత్తులో భాగంగా కాంగ్రెస్ 20 స్థానాలు డిమాండ్ చేయగా ఇందుకు అంగీకరించలేదు ఎస్పీ బీఎస్పీ. మరీ తక్కువ స్థానాలతో బరిలోకి దిగితే ఉత్తర్ప్రదేశ్లో కాంగ్రెస్ కనుమరుగవుతుందని హస్తం పార్టీ భావించి అన్ని స్థానాల్లో పోటీచేసేందుకు తమ అభ్యర్థులను సిద్ధం చేస్తోంది. జాతీయ స్థాయిలో తాము ఎన్డీఏతోనే పోరాడుతున్నామని చెబుతూనే... 2022 అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే తయారు అవుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇక బీజేపీ ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ ఓ వైపు కాంగ్రెస్ పార్టీ మరోవైపుతో పోటీ పడుతోంది. అంతేకాదు కొత్తగా పార్టీ పెట్టిన శివరాజ్ సింగ్ యాదవ్ కూడా సీట్లు గెలవనప్పటికీ ఓట్లు మాత్రం చీల్చే సత్తా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
కాంగ్రెస్కు ముస్లిం ఓట్లను చీల్చగలిగే సామర్థ్యం
ఇదిలా ఉంటే ముక్కోణపు పోటీలో బీజేపీకి కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ... కాంగ్రెస్కు 12 స్థానాలు ఇచ్చేలా ఓ అవగాహనకు ఎస్పీ బీఎస్పీ వస్తే బాగుంటుందని కాంగ్రెస్ నాయకుడు ఒకరు చెప్పారు. కాంగ్రెస్తో పొత్తుతో వెళ్లేందుకు అఖిలేష్ యాదవ్ ఒప్పుకున్నప్పటికీ బీఎస్పీ అధినేత్రి మాత్రం ఇందుకు ససేమిరా అంటున్నారు. దీంతో ఇది పరోక్షంగా బీజేపీకి కలిసివస్తుందని ఆ కాంగ్రెస్ నాయకుడు అంచనావేస్తున్నారు. మరోవైపు బీజేపీ నేత చంద్రమోహన్ కాంగ్రెస్ నేత వాదనను కొట్టిపారేశారు. కమలం పార్టీకి సొంత బలం ఉందని విపక్షాలు ఏకమైతే బీజేపీకి కలిసొస్తుందనే వాదనలో నిజం లేదని చెప్పారు. మోడీ చరిష్మాతో బీజేపీ యూపీలో అత్యధిక స్థానాలు గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఇదిలా ఉంటే ఎస్పీ ప్రతినిధి అబ్దుల్ హఫీజ్ గాంధీ మాత్రం ఎస్పీ బీఎస్పీ ఆర్ఎల్డీ పార్టీల కలయికను ఎవరూ కదలించలేరని అత్యధిక శాతం ఓట్లు ఈ కలయికే పడుతాయని చెప్పారు. కాంగ్రెస్ తమ ఓటు బ్యాంకుపై ప్రభావం చూపలేదని అబ్దుల్ హఫీజ్ చెప్పారు. కాంగ్రెస్కు ఏదైనా అదనంగా ఓటుశాతం లభిస్తే అది బీజేపీ ఓటు బ్యాంకు నుంచే వస్తాయని చెప్పారు. కొన్ని సామాజిక వర్గాల్లో బీజేపీకి, కాంగ్రెస్ పార్టీలకు ఇంచుమించు ఒకే రకమైన ఓటర్లు ఉన్నారని చెప్పుకొచ్చారు. మరోవైపు రాజకీయ విశ్లేషకులు బద్రి నారాయణ్ మాత్రం ఇంకోలా విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓట్లు చీల్చే అవకాశం ఉందని అది బీజేపీకి పాజిటివ్గా మారుతుందని చెబుతున్నారు. అదే సమయంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కూడా కాంగ్రెస్ చీలిస్తే అది కమలం పార్టీకి గట్టి షాకే ఇచ్చినట్లు అవుతుందని చెప్పారు.
విపక్షాలు ఒంటరి పోరుతో 2014లో బీజేపీకి ఇలా కలిసొచ్చింది
సహారన్పూర్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ 65,090 ఓట్ల మెజార్టీతో గెలిచింది. రెండో స్థానంలో కాంగ్రెస్ నిలిచింది. బీజేపీకి 39.59 శాతం ఓట్లు వచ్చాయి. అదే కాంగ్రెస్కు 34.14 శాతం ఓట్లు వచ్చాయి. బీఎస్పీకి 19.67శాతం ఓట్లు రాగా..సమాజ్వాదీ పార్టీకి 4.42 శాతం ఓట్లు వచ్చాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీలు ముస్లిం అభ్యర్థులను బరిలో నిలబెట్టారు. దీంతో ఇక్కడ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓట్లు చీలిపోవడంతో బీజేపీ అభ్యర్థికి కలిసొచ్చింది. ఇక రెండో ఉదాహరణ తీసుకుందాం... పశ్చిమ ఉత్తర్ప్రదేశ్లో సంభాల్ లోక్సభ నియోజకవర్గం గమనిస్తే... ఎస్పీ బీఎస్పీ పార్టీలు 2014లో ముస్లిం అభ్యర్థులను నిలిపాయి. దీంతో ఓట్లు చీలిపోవడంతో బీజేపీ అభ్యర్థి 5174 స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. ఇక ఎస్పీ బీఎస్పీల మధ్య హోరాహోరీ పోరు జరగడంతో గజియాపూర్ సీటును బీజేపీ కైవసం చేసుకుంది. ఇక మొత్తంగా చూసుకుంటే... ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీలు కలిసి 44శాతం ఓట్లు సాధించాయి. ఆ సమయంలో బీజేపీకి 42.63 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు ఈ మూడు పార్టీలు కలిసి పొత్తుతో వెళుతున్నందున బీజేపీకి కాస్త కష్టమే అని చెప్పక తప్పదు.
చివరిగా ఈ కూడికలు తీసివేతలతో బలమైన బీజేపీని ఈ పొత్తు కూల్చుతుందని కచ్చితంగా చెప్పలేము. ఉత్తర్ప్రదేశ్లో ఇంకా మోడీ మానియా నడుస్తోంది. 2014లో ఉన్నంతగా కాకపోయినప్పటికీ కాస్తో కూస్తో ఇంకా ఉంది. దశాబ్దాలుగా బద్ధ శత్రువులుగా ఉన్న వారంత ఒక్కరాత్రిలోనే మిత్రులుగా మారితే క్యాడర్ ఓట్లు వేస్తుందని అనుకోవడం పెద్ద తప్పిదమే అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఓట్ల బదిలీని మూడు పార్టీలు కలిసి తమ క్యాడర్కు ఎలాంటి దిశానిర్దేశం చేసేదానిపైనే వీరి గెలుపోటములు ఆధారపడి ఉంటయానేది మరవకూడదని అనలిస్టులు చెబుతున్నారు.