కోచింగ్ లేకుండా మెడికల్ సీట్ సాధించిన గిరిజన బాలిక: అందుకే అద్భుతం
నయా రాయపూర్: చత్తీస్గఢ్లోని సుకుమా జిల్లా నక్సలైట్ ప్రభావిత ప్రాంతం అని తెలిసిందే. ఇక్కడి విద్యార్థులు చదువుకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడతారు. ఈ జిల్లాలో ఎవరిని 'మీ స్కూల్లో ఈ రోజు టీచర్ ఉన్నారా' అని అడిగితే దాదాపు 'లేరు' అని సమాధానం వస్తుంది. మావోల ప్రాభల్యం ఉన్న ఈ ప్రాంతంలో అడుగు పెట్టేందుకు టీచర్లంతా భయపడతారు.
ఇలాంటి జిల్లా నుంచి ఓ అమ్మాయి అద్భుతం సాధించింది. మాయా కష్యప్ అనే దోర్నపాల్కు చెందిన విద్యార్థిని కోచింగ్కు వెళ్లకపోయినా నీట్ పరీక్ష రాసి ఎంబీబీఎస్ సీటు సాధించింది.
ఇక్కడి ప్రాంతానికి తోడు ఆమె కూడా ఎన్నో ఇబ్బందులు పడింది. అందుకే ఆమె సీటు సాధించడం అద్భుతమే. తొమ్మిదేళ్ల క్రితం తండ్రి చనిపోయాడు. భారం తల్లిపై పడింది. నలుగురి సంతానంలో ఒకరైన ఆ బాలిక చదువు కొనసాగించడం కష్టమైంది.
కానీ డాక్టర్ కావాలన్న తన లక్ష్యంతో ఆమె ఎన్నో కష్టాలను ఓర్చింది. నీట్కు ఎలాంటి శిక్షణ తీసుకోకుండా, ఒకవేళ సీటొస్తే ఫీజులు చెల్లించడానికి డబ్బులకు ఏం చేయాలో కూడా తెలియని స్థితిలో ఆమె ఎంబీబీఎస్ సీటును పొందింది.
చత్తీస్గఢ్ నుంచి నీట్ రాసిన 12,315 మంది ఎస్టీ విద్యార్థుల్లో ఆమె 154వ ర్యాంకు సాధించింది. అంబికాపుర్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందింది. ఆమె నీట్లో ర్యాంకు తెచ్చుకున్న తర్వాత కుటుంబం ఎంతో సంతోషపడింది. అదే సమయంలో ఫీజులకు ఏం చేయాలంటూ ఆందోళనకూ లోనైంది. ఆమె పెద్దన్నయ్య అనుప్ ఓ స్నేహితుడి నుంచి అప్పు తెచ్చాడు. వదిన రత్న కష్యప్ బంధువుల నుంచి కొంత నగదు తీసుకొచ్చారు. మాయా కశ్యప్ మాట్లాడుతూ.. డాక్టర్ కావాలనేది చిన్నప్పటి నుంచి తన కోరిక అని చెప్పింది.