పాకిస్తాన్కు చిక్కి- 23 ఏళ్లు జైళ్లలో మగ్గి ఒడిశా తిరిగొచ్చిన గిరిజనుడు- అరుదైన ఘటన
23 ఏళ్ల క్రితం ఒడిశాలోని ఓ మారుమూల గ్రామం జంగతోలి. ఓ 27 ఏళ్ల మతిస్దిమితం లేని గిరిజనుడు ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఎక్కడెక్కడో తిరిగి చివరికి పాకిస్తాన్ సరిహద్దులకు చేరుకున్నాడు. అక్కడ పాక్ రేంజర్లు పట్టుకుని నిర్బంధించారు. గూడఛర్యం చేస్తున్నట్లు ఆనవాళ్లు లేకపోయినా అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అరెస్టు చేసి జైల్లో వేశారు. దర్యాప్తులో ఏమీ నిర్ధారణ కాలేదు. అలాగని వదిలిపెట్టలేరు. ఏం చేయాలో తెలియక అనుమానాస్పద కేసుగా జైల్లో వేశారు. మీడియా హంగామా లేని రోజుల్లో అప్పటి నుంచీ జైల్లోనే. ప్రభుత్వాలు కూడా జోక్యం చేసుకోలేదు. చివరికి 23 ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యుల ప్రయత్నాలు ఫలించాయి. ఎట్టకేలకు ఆయన తాజాగా ఇంటికి చేరాడు.
తప్పిపోయి పాకిస్తాన్ చేరిన బిర్జూ...
ఒడిశాలోని ఓ మారుమూల గిరిజన గ్రామంలో పుట్టిన బిర్జూ కుల్లూ తప్పిపోయి పాకిస్తాన్కు చేరాడు. మతి స్ధిమితం లేకపోవడంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన బిర్జూ తప్పిపోయినట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు స్ధానిక పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. మతిస్ధిమితం లేకపోవడం, దొరుకుతాడన్న ఆశ కూడా లేకపోవడంతో కుటుంబ సభ్యులు కూడా వెతికి వెతికి విసిగిపోయారు. ఇక ఫలితం లేదని భావించి ఆయన్ను వదిలేశారు. చివరికి మతిస్ధిమితం లేని కొడుకు కోసం వెతికి వెతికి తల్లితండ్రులు కూడా ఆవేదనతో చ చనిపోయారు. ఉన్న ఒక్కగానొక్క సోదరి పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. దగ్గరి బంధువులు కూడా ఏం చేయలేక వదిలేశారు.
23 ఏళ్లపాటు లాహోర్ జైల్లోనే...
భారత్లో తప్పిపోయి పాకిస్తాన్ చేరుకున్న బిర్జూ కుల్లూను నిర్బంధించిన పాక్ అధికారులు పలుమార్లు విచారణ జరిపినా వదిలిపెట్టలేదు. అలా 23 ఏళ్లపాటు లాహోర్ జైల్లోనే మరో 20 మంది భారతీయ ఖైదీలతో కలిసి కుల్లూ ఉండిపోయాడు. జీవితఖైదు అనుభవిస్తూ జైల్లోనే ఉండిపోయిన కుల్లూ గురించిన సమాచారం ఎలాగోలా భారత అధికారులకు లభించడం, కుల్లూపై తీవ్ర అభియోగాలేవీ నమోదు కాకపోవడం వంటి కారణాలతో పాకిస్తాన్ అధికారులు సానుకూలంగా వ్యవహరించారు. దీంతో భారత అధికారుల వినతి మేరకు కుల్లూను విడుదల చేసేందుకు పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
జైలు నుంచి క్వారంటైన్.. తర్వాత ఇంటికి...
పాకిస్తాన్ అధికారులు సానుకూలంగా వ్యవహరించి జైలు నుంచి కుల్లూను వదిలిపెట్టినా భారత్ చేరుకోగానే పంజాబ్లో కరోనా క్వారంటైన్ తప్పలేదు. అక్టోబర్ 26న పాకిస్తాన్ నుంచి అమృత్సర్ చేరుకున్న కుల్లూను అధికారులు క్వారంటైన్కు తరలించారు. అక్కడ 14 రోజులు ఉంచాక తిరిగి ఆయన స్వస్ధలం ఒడిశాకు పంపారు. స్ధానిక అధికారుల సాయంతో కుల్లూ ఇప్పుడు ఆయన స్వస్ధలం జంగతోలి చేరుకున్నారు. అప్పటికే కుల్లూ తిరిగొస్తున్నాడన్న సమాచారం అందడంతో ఆయన కుటుంబసభ్యులు, బంధువుల్లో బతికున్న వారంతా ఒక్కచోటికి చేరుకున్నారు. కుల్లూకు ఘనస్వాగతం పలికారు. సుదీర్ఘ విరామం తర్వాత స్వస్ధలానికి చేరడంతో కుల్లూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఇప్పుడు ఆయనకు అన్ని విషయాలు గుర్తులేవు. అయినా ఇంటికి చేరానన్న సంతోషంలో ఆయనకు అవేవీ కనిపించలేదు.