భర్తను ఎత్తుకుని 2కి.మీల పరుగు, కొట్టుకుంటూ తీసుకెళ్లారు: ఎందుకంటే..?
భోపాల్: మారుమూల గ్రామాల్లో పంచాయతీల పేరుతో అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏదైనా తప్పు చేసినట్లు పంచాయతీ పెద్దల దృష్టికి వస్తే వారి ఇష్టానుసారం శిక్షలు విధిస్తూ తమ పైశాచికాన్ని చాటుకుంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్లో ఓ గిరిజన మహిళకు భర్తను మోసుకుని పరిగెత్తాలంటూ శిక్ష విధించడం గమనార్హం.
మరో వ్యక్తితో వెళ్లిన భార్య..
భిల్లా తెగ ఎక్కువగా నివసించే ఝాబువా జిల్లా ఖేడి గ్రామంలో పది రోజుల క్రితం వివాహిత అయిన ఆ గిరిజన మహిళ మరో గిరిజన వ్యక్తితో వెళ్లిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆమె వెనక్కి వచ్చింది. అయితే, పంచాయితీ పెద్దలు కలుగజేసుకుని ఆమె భర్తకు కలిసుండాలని సర్దిచెప్పి పంపారు.
శిక్ష విధించాలంటూ..
అయితే ఆమె చేసిన తప్పు కోసం కఠిన శిక్ష విధించాల్సిందేనంటూ భర్త, అతని తరపు బంధువులు ఆమెను అందరి సమక్షంలో చితకబాదారు. ఆ తర్వాత పంచాయతీ పెద్దలు కూడా.. రెండు కిలో మీటర్లు భర్తను మోస్తూ పరిగెత్తాలంటూ ఆ మహిళకు శిక్ష విధించారు.
భర్తును ఎత్తుకుని పరుగెడుతుండగానే కొట్టడం..
సదరు మహిళ పరిగెడుతున్న సమయంలో భుజాలపై ఉన్న భర్తతోపాటు గ్రామస్తులు కూడా ఆమెను కొట్టడం వారి పైశాచికానికి నిదర్శనంగా నిలుస్తోంది. కాగా, ఈ ఉదంతం కొందరు వీడియో తీయడంతో ఆదివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
నలుగురి అరెస్ట్..
చివరకు బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో.. ఆమె మరిది, మామయ్యతోపాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు.