మానవత్వం మంటగలిపారు: ఆ యువకుడి హత్య, ఆపై సెల్ఫీలు..
తిరువనంతపురం: దొంగతనం చేశాడన్న ఆరోపణలతో మానసిక వైకల్యం ఉన్న ఓ గిరిజన యువకుడిపై తీవ్రంగా దాడి చేసి హత్య చేసిన ఘటన కేరళలోని పాలక్కడ్ జిల్లా అత్తపాడిలో చోటు చేసుకుంది.
మృతుడు స్థానిక గిరిజనుడు..
గురువారం నాడు చోటు చేసుకున్న ఈ ఘటనలో బాధితుడిని కదుకుమన్నకు చెందిన ఎ.మధుగా గుర్తించారు. అత్తపాడికి సమీపంలోని ఓ అడవిలో సాయంత్రం 4గం. సమయంలో మధు ఆ ప్రాంతంలో తిరగడం స్థానికులు గమనించారు.
దొంగతనం చేశాడని దాడి..
అంతకు మూడు రోజుల ముందు స్థానికంగా ఒకరి ఇంట్లో దొంగతనం జరిగింది. దీంతో ఆ దొంగతనం చేసింది మధునే అన్న అనుమానంతో అతనిపై దాడి కర్రలతో దాడి చేశారు.
దాడి అనంతరం పోలీసులకు అప్పగించగా.. జీపులో స్టేషనుకు తరలిస్తున్న క్రమంలో మధు కుప్పకూలిపోయాడు. దీంతో అతను చనిపోయినట్టుగా గుర్తించారు.
మానవత్వం మంటగలిసింది..
ఓ మానపసిక వైకల్యం ఉన్న వ్యక్తిపై అంత తీవ్రంగా దాడి జరుగుతుంటే.. కొంతమంది యువకులు అక్కడ సెల్ఫీలు దిగడం గమనార్హం. మానవత్వం ఉన్న సాటి మనుషులుగా దాడిని ఆపాల్సిందిపోయి సెల్ఫీల కోసం ఎగబడటం విచారకరం.
15మందిపై కేసు:
దాడికి పాల్పడిన 15మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధితుడి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.