ఒక ఎమ్మెల్యే, ఆరుగురు కౌన్సిలర్లే : బీజేపీలో చేరికలపై టీఎంసీ క్లారిటీ
కోల్కతా : ఎన్నికల ఫలితాల తర్వాత మిగతా పార్టీ నేతలను బీజేపీ ఆకట్టుకుంటోంది. ఇందులోభాగంగా టీఎంసీకి చెందిన నేతలు నిన్న బీజేపీలో చేరారు. ముగ్గురు ఎమ్మెల్యేలు, 50 మంది కౌన్సిలర్లు కాషాయ కండువా కప్పుకున్నట్టు మీడియాలో ప్రచారం జరిగింది. అయితే జరిగిన దానిపై టీఎంసీ వివరణ ఇచ్చింది. తమ పార్టీ నుంచి అంతమొత్తంలో నేతలు వెళ్లిపోదని స్పష్టంచేసింది.
ఒక్క ఎమ్మెల్యేనే ..
టీఎంసీ నుంచి ఒక ఎమ్మెల్యే, ఆరుగురు కౌన్సిలర్లు మాత్రమే బీజేపీలో చేరినట్టు ఆ పార్టీ వర్గాలు బుధవారం ధ్రువీకరించాయి. వారిలో ఒక ఎమ్మెల్యేపై క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు సస్పెండ్ చేశామని పేర్కొంది. కానీ బీజేపీ గోరంత కొండంత చేసి ప్రచారం చేసిందని సోషల్ మీడియాలో ట్విట్టర్లో మండిపడింది. మంగళవారం బీజేపీలో చేరిన నేతలు కాంగ్రెస్, సీపీఎంకు చెందిన నేతలను కుండబద్దలు కొట్టీ మరి చెప్పింది.
సస్పెన్షన్ వేటు
బీజేపీ నేత ముకుల్రాయ్ కుమారుడు సుబ్రన్షు రాయ్, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సహా 50 మంది కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. దీంతో బెంగాల్లో బీజేపీ మంచి బలం చేకూరినట్టైంది. బీజేపీలో చేరాక మీడియాతో కూడా మాట్లాడారు ఎమ్మెల్యేలు. సుబ్రన్షు సహ .. తుషార్ కాంతీ భట్టాచార్య, సీపీఎంకు చెందిన దేబెంద్ర నాథ్ రాయ్ ఉన్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పార్టీలో వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు సుబ్రన్షుపై టీఎంసీ సస్పెన్షన్ వేటువేసింది. వీరేకాదు మరికొంత మంది కూడా బీజేపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని బెంగాల్ బీజేపీ చీఫ్ కైలాశ్ విజయ్, బీజేపీ నేత ముకుల్ రాయ్ తెలిపారు. అంతేకాదు బెంగాల్లో ఏడు విడతల్లో ఎన్నికలు జరిగాయని .. బీజేపీలో చేరికలు కూడా ఏడు విడతలుగా ఉంటాయని స్పష్టంచేశారు.
మరో రెండేళ్లలో బెంగాల్లో ఎన్నికలు ఉన్నాయని ..
అప్పటివరకు టీఎంసీలో నేతలు లేకుండా పోతారని ముకుల్ రాయ్ జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఎంసీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాదని ధీమా వ్యక్తం చేశారు. మమత పాలనలో రాష్ట్రంలో అన్నీ వ్యవస్థలు భ్రష్టుపట్టాయని .. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని విమర్శించారు. మమత నిరంకుశత్వాన్ని చూసి .. నేతలు ఇతర పార్టీల్లోకి చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. బెంగాల్లో సీపీఎం ప్రభ కూడా లేకపోవడంతో .. ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ అవతరించిందని వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీ మరింత బలపడి .. వచ్చే ఎన్నికల్లో విజయబావుటా ఎగరవేయడం తథ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు.