కరోనా కాటు: వైరస్ సోకి ఎమ్మెల్యే తమోనష్ ఘోస్ మృతి, బెంగాల్ తొలి ఎమ్మెల్యేగా..
కరోనా వైరస్ సోకిన ఎమ్మెల్యే తమోనష్ ఘోష్ (60) బుధవారం మృతిచెందారు. ఇది పశ్చిమబెంగాల్లో తొలి ఎమ్మెల్యే మరణంగా నమోదైంది. ఈయన అధికార పార్టీకి చెందిన నేత. మమతా బెనర్జీకి నమ్మిన బంటు. ఫల్టా అసెంబ్లీ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మే నెలలో కరోనా వైరస్ రావడంతో చికిత్స అందిస్తున్నారు. అయితే ఇతనికి గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులు కూడా ఉన్నాయని వైద్యులు తెలిపారు.
భారత్ పై కరోనా పంజా...ప్రపంచంలో మరణాలలో 8వ స్థానం,24 గంటల్లో 16 వేలకు చేరువలో కేసులు,రికార్డ్ బ్రేక్
ఘోష్ మృతిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. గత 35 ఏళ్లుగా తమలో ఒకడై ఉన్నారని, మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారని పేర్కొన్నారు. 1998 నుంచి టీఎంసీ కోశాధికారి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. తన జీవితం అంతా ప్రజలు, పార్టీ కోసం పనిచేశారని, సామాజిక సేవ చేశారని పేర్కొన్నారు. అతని మృతి పార్టీకి తీరని లోటు అని.. అతని భార్య జర్నా, కూతుళ్లు, స్నేహితులు, బంధువులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ మేరకు మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.
పశ్చిమబెంగాల్లో కూడా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం వైరస్ సోకిన 11 మంది చనిపోయారు. హౌరా జిల్లాకు చెందిన 4, కోల్ కతా, ఉత్తర పరగణ జిల్లాల నుంచి ముగ్గురు చొప్పున, పర్బా మెడినిపూర్ నుంచి ఒకరు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 580కి చేరింది. 370 పాజిటివ్ కేసులు నమోదవడంతో.. వైరస్ మొత్తం కేసుల సంఖ్య 14 వేల 728కి చేరింది.