రేప్ వ్యాఖ్యలు: తపస్పాల్పై కేసు నమోదుకు కోర్టు ఆర్డర్
ఇటీవల తమ పార్టీ కార్యకర్తల సమావేశంలో తపస్ మాట్లాడుతూ.. తమ వాళ్లను బెదిరిస్తే తాను చూస్తూ ఊరుకోనని.. మీ(సిపిఎం) పార్టీ మహిళలను అత్యాచారం చేయాలని మా కార్యకర్తలకు పిలుపునిస్తానని అన్నారు. కోల్కాతాలో సిపిఎం కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలపై వివాదం రేగింది.
ఇది ఇలా ఉండగా మరోసారి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తపస్ పాల్. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల గొంతులు కోయండని ఆయన తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. తానే స్వయంగా వారిని కాల్చి చంపుతానని హెచ్చరించారు. ఆ వీడియో ఫుటేజీ ఓ మీడియాలో ప్రసారం కావడంతో తపస్ పాల్పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.
కాగా, తాను రేప్ చేయిస్తానని చెప్పలేదని, రెయిడ్ (సోదాలు) చేయిస్తానని మాత్రమే చెప్పానని తపస్ పాల్ వివరణ ఇచ్చారు. మరోవైపు, ఈ విషయమై తపస్ పాల్పై చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించగా.. "అతని విషయంలో నేనేం చేయాలని మీరు అనుకుంటున్నారు, అతన్ని చంపేయాలా?" అని ఆమె మీడియా వద్ద మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
అయితే నడియా జిల్లాకు చెందిన బిప్లాబ్ చౌదరి అనే వ్యక్తి పాల్పై చర్యలు తీసుకోవాలని, తనకు అతడి మద్దతుదారుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై పోలీసులు స్పందించకపోవడంతో కోర్టు సోమవారం తపస్ పాల్పై కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసింది.