రేప్ వ్యాఖ్యలు: తపస్ పాల్ సేఫ్, క్షమాపణలతో సరి
కోల్కతా: రాజకీయ ప్రత్యర్థుల మహిళలలపై అత్యాచారాలకు తమ కార్యకర్తలను పంపిస్తానని వ్యాఖ్యలు చేసిన పార్టీ పార్లమెంటు సభ్యుడు తపస్ పాల్పై తృణమూల్ కాంగ్రెసు ఏ విధమైన చర్యలు తీసుకోకూడదని నిర్ణయించుకుంది. తపస్ పాల్ బేషరతుగా చెప్పిన బహిరంగ క్షమాపణలను అంగీకరించి, దానితో సరిపెట్టాలని నిర్ణయం తీసుకుంది.
సరైన స్ఫూర్తితో ఉన్నందున తపస్ పాల్ క్షమాపణలను అంగీకరించామని తృణమూల్ నాయకుడు డెరెక్ ఓబ్రెయిన్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. కాగా, తపస్ పాల్పై సూమోటోగా కేసు నమోదు చేసి, పీనల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారంనాడు కలకత్తా హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలైంది.
హైకోర్టులో సమిత్ సన్యాల్ అనే వ్యక్తి ఆ పిల్ దాఖలు చేశారు. పోలీసులు సూమోటాగా కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోర్టును అర్థించారు. బేషరతుగా క్షమాపణ చెబుతూ తపస్ పాల్ మీడియాకు, పార్టీకి లేఖ రాశారు.
2014 లోకసభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆ సంఘటన చోటు చేసుకుందని తపస్ పాల్ తన క్షమాపణ లేఖలో చెప్పారని సన్యాల్ తరఫున కోర్టులో వాదిస్తున్న సుబ్రతా ముఖోపాధ్యాయ అన్నారు.