బెంగాల్ పంచాయితీ ఎన్నికలను స్వీప్ చేసిన తృణమూల్..
కోల్ కతా: బెంగాల్ పంచాయితీ ఎన్నికలను తృణమూల్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసేట్టుగా కనిపిస్తోంది. ఇప్పటిదాకా వెల్లడైన ఫలితాల ప్రకారం 621 జిల్లా పరిషత్ స్థానాలకు గాను 351 స్థానాల్లో టీఎంసీ విజయం సాధించింది. బీజేపీ కేవలం 9 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. వామపక్షాలు, కాంగ్రెస్ చెరో రెండు, నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
ఇక గ్రామ సభ సీట్లలోనూ టీఎంసీ దుమ్ము రేపింది. మొత్తం 29,634సీట్లకు గాను 26,601 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. అంటే, 89శాతం సీట్లు టీఎంసీ ఖాతాలోకే వెళ్లాయన్నమాట. టీఎంసీ తర్వాతి స్థానంలో బీజేపీ 6.85శాతం స్థానాలను గెలుచుకుంది.
ఇక వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు కేవలం 1.38శాతం, 1.6శాతం సీట్లకే పరిమితం కావడం గమనార్హం. మొత్తం 31,386 సీట్లకు ఎన్నికలు జరగ్గా.. ప్రస్తుతం కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది.
'90శాతం సీట్లను గెలుచుకుని టీఎంసీ తన సత్తా చాటింది. విపక్షాలు ఏకమై పోటీకి దిగినా మా గెలుపును అడ్డుకోలేకపోయారు. దీన్నిబట్టి క్షేత్ర స్థాయిలో మా పార్టీ ఎంత బలమైన పునాది కలిగి ఉందో అర్థం చేసుకోవచ్చు' అని పంచాయితీ ఎన్నికల ఫలితాలపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు.
TMC has emerged victorious in 90% seats despite the opposition parties coming together. This shows how strong we are at the grassroot level: West Bengal CM Mamata Banerjee #PanchayatElections pic.twitter.com/8sWBQaSyTG
— ANI (@ANI) May 17, 2018