మోడీకి భారీ షాక్: సర్వే... ఆ 3 రాష్ట్రాల్లో అధికారం కాంగ్రెస్దే! ఎవరికి ఎన్ని సీట్లు అంటే?
న్యూఢిల్లీ: రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, మిజోరాం, తెలంగాణ ఎన్నికలకు శనివారం నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ విడుదలకు ముందు ఏబీపీ 2019 లోకసభ ఎన్నికల కోసం సీ ఓటరుతో కలిసి సర్వే చేసింది. ఈ సర్వేలో బీజేపీకి కొన్ని సీట్లు తగ్గినా నరేంద్ర మోడీ మళ్లీ ప్రధానమంత్రి అవుతారని తేలింది.
అయితే, త్వరలో జరిగే రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం తప్పదని తాజా ఏబీపీ సర్వేలో వెల్లడైంది. ఎన్నికల సంఘం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఏబీపీ సర్వే చేసింది. పై మూడు రాష్ట్రాల్లో బీజేపీకి షాక్ తప్పదని వెల్లడైంది.
బీజేపీ షాకింగ్: మధ్యప్రదేశ్లో మంత్రులు సహా 70 మందికి టిక్కెట్ నిరాకరణ!
మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం
ప్రస్తుతం చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది. ఈ పార్టీ వరుసగా ఈ రాష్ట్రాల్లో రెండు మూడు సార్లు అధికారంలోకి వచ్చింది. దీంతో ప్రజా వ్యతిరేకత సహజం. అయినప్పటికీ మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్, చత్తీస్గఢ్లో రమణ సింగ్ల పైన మంచి అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన గంటల్లోనే ఏబీపీ సర్వే చేసింది. ఈ హడావుడి సర్వే మాట ఎలా ఉన్నప్పటికీ ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీకి షాక్ తప్పదని సర్వేలో వెల్లడైంది.
రాజస్థాన్లో బీజేపీకి భారీ దెబ్బ
ఏబీపీ ఒపీనియన్ పోల్ ప్రకారం... రాజస్థాన్లో 200 స్థానాలకు గాను బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. 2013లో బీజేపీ 163 సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు కేవలం 56 స్థానాలకే పరిమితం కానుంది. కాంగ్రెస్ గత ఎన్నికల్లో 21 సీట్లకు పరిమితమైంది. అదే కాంగ్రెస్ ఈసారి 142 స్థానాలు గెలుచుకోనుంది. ఇదే జరిగితే బీజేపీకి ఇక్కడ పెద్ద దెబ్బ. ఓట్ షేర్ విషయానికి వస్తే బీజేపీకి 34.3 శాతం, కాంగ్రెస్కు 49.9 శాతం రానుంది. ఇతరులు రెండు స్థానాల్లో గెలవనున్నారని సర్వేలో తేలింది.
మధ్యప్రదేశ్లో నాలుగోసారి ఓటమి తప్పదా?
ఏబీపీ ఒపీనియన్ పోల్ ప్రకారం... మధ్యప్రదేశ్లోని 230 స్థానాల్లో బీజేపీ 108 స్థానాల్లో గెలవనుంది. కాంగ్రెస్ పార్టీ 122 స్థానాల్లో విజయం సాధించనుంది. ఇతరులు ఒక స్థానంలో గెలవనున్నారు. మధ్యప్రదేశ్లో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. 2013లో బీజేపీ 165 స్థానాల్లో, కాంగ్రెస్ 58 నియోజకవర్గాల్లో గెలిచింది. ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే 15 ఏళ్ల తర్వాత బీజేపీ పాలన ముగియనుంది. ఓట్ షేర్ విషయానికి వస్తే బీజేపీకి 41.5 శాతం, కాంగ్రెస్కు 42.2 శాతం రానుంది. వరుసగా మూడుసార్లు ఓ పార్టీ అధికారంలో ఉండటం అంటే ప్రజా వ్యతిరేకత సహజమే. అయినప్పటికీ 100కు పైగా స్థానాలు గెలుచుకోనుందని ఈ సర్వేలో తేలిందంటే, ముందు ముందు ప్రచారం తర్వాత మరింత బీజేపీకి లాభించనుందని అంటున్నారు.
చత్తీస్గఢ్ పోటాపోటీ
ఏబీపీ సర్వే ప్రకారం చత్తీస్గఢ్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ పోటీ నెలకొనే అవకాశముంది. 2013లో ఇక్కడ బీజేపీ 49, కాంగ్రెస్ 39 సీట్లు గెలుచుకున్నాయి. ఈసారి బీజేపీకి 40, కాంగ్రెస్ పార్టీకి 47 సీట్లు రానున్నాయని సర్వేలో వెల్లడైంది. చత్తీస్గఢ్లో మొత్తం 90 స్థానాలు ఉన్నాయి. ఓటు షేర్ విషయానికి వస్తే బీజేపీకి 38.6 శాతం, కాంగ్రెస్కు 38.9 శాతం రానుంది. రమణ్ సింగ్ పాలనపై ప్రజలకు పెద్దగా వ్యతిరేకత లేదు. కానీ వరుస పాలన కారణంగా అసంతృప్తి ఉంటుందని అంటున్నారు.