లోకసభకు ట్రిపుల్ తలాక్ బిల్లు: వ్యతిరేకించిన ఓవైసీ
న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ బిల్లు గురువారం లోకసభ ముందుకు వచ్చింది. ట్రిపుల్ తలాక్ను నేరంగా పరిగణిస్తూ రూపొందించిన ఈ బిల్లును న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోకసభలో ప్రవేశపెట్టారు.
Recommended Video
ప్రధాని నరేంద్ర మోడీ ఏకాభిప్రాయ సాధన కోసం విజ్ఞప్తి చేసినప్పటికీ కొంత మంది సభ్యులు దాన్ని వ్యతిరికించారు. మజ్లీస్ సభ్యుడు అసదుద్దీన్ ోఓవైసీ దాన్ని వ్యతిరేకించారు.
దేశంలో ఇప్పటికే ట్రిపుల్ తలాక్ అక్రమమని, అందువల్ల ప్రత్యేకంగా ఈ బిల్లు అవసరం లేదని ఆయన అన్నారు. ఈ బిల్లు ప్రాథమిక హక్కులకు భంగకరమని, అవసరమైతే దీన్ని గృహహింసను అరికట్టేందుకు ఉద్దేశించిన చట్టంలో చేర్చాలని ఆయన అన్నారు.
భర్తను జైలుకు పంపితే బాధితురాలికి నష్టపరిహారం ఎలా అందుతుందని ఆయన ప్రశ్నించారు.
బిజూ జనతాదళ్ కూడా ఈ బిల్లును వ్యతిరేకించింది. బిల్లులో చాలా అంతర్గత వైరుధ్యాలున్నాయని ఆ పార్టీ సభ్యుడు భర్తృహరి మహతాబ్ అన్నారు. అయితే, ప్రతిపక్షాల వ్యతిరేకతను మంత్రి రవిశంకర్ ప్రసాద్ తోసి పుచ్చారు. ఈ బిల్లును తేకపోతే చాలా మంది మహిళలకు న్యాయం జరగదని, ట్రిపుల్ తలాక్ చట్టవ్యతిరేకమని సుప్రీంకోర్టు చెప్పినా దాంతో మహిళలు ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు.
ముస్లిం మహిళా (వివాహ రక్షణ హక్కులు) బిల్లుకు హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని బృందం రూపకల్పన చేసింది. మూడు సార్లు తలాక్ అని చెప్తే ముస్లిం పురుషుడికి భార్యతో విడాకులు తీసుకునే అవకాశం ఉంటూ వచ్చింది.
దాన్ని అక్రమంగా పరిగణిస్తూ ఈ బిల్లును రూపొందించారు. బిల్లు చట్టరూపం ధరిస్తే ట్రిపుల్ తలాక్ చెప్పే పురుషుడికి మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా పడుతుంది. మత పెద్దలతో చర్చించిన తర్వాతనే బిల్లును ప్రతిపాదించాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీని కోరింది.
బిల్లును రూపొందించడంలో ఏ విధమైన పద్ధతిని అవలంబించలేదని విమర్శించింది. ట్రిపుల్ తలాక్ అక్రమమని, రాజ్యాంగ విరుద్ధమని, అర్థరహితమైనదని సుప్రీంకోర్టు ఆగస్టులో అభిప్రాయపడింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం బిల్లును రూపొందించింంది.