లోక్సభలో పాస్ అయిన ట్రిపుల్ తలాక్ బిల్లు ...సభ నుంచి కాంగ్రెస్ అన్నాడీఎంకే వాకౌట్
ముస్లిం మతానికి సంబంధించిన కీలక ట్రిపుల్ తలాక్ బిల్లు ఎట్టకేలకు లోక్సభలో పాస్ అయ్యింది. అయితే బిల్లును జాయింట్ సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఇందుకు ప్రభుత్వం ఒప్పుకోలేదు. దీంతో లోక్సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సభనుంచి వాకౌట్ చేసింది. లోక్సభలో ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించారు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. అయితే సెలెక్ట్ కమిటీకి పంపాలని కాంగ్రెస్ పట్టుబట్టడం..కాంగ్రెస్ ప్రతిపాదనకు టీఎంసీ, మజ్లిస్ పార్టీలు మద్దతు తెలపడంతో ప్రభుత్వం ఇందుకు నిరాకరించింది. ట్రిపుల్ తలాక్ చెప్పడం తప్పుగా సుప్రీం కోర్టు పేర్కొందని ఇక దీనిపై బిల్లు అనవసరమని విపక్షాలు పేర్కొన్నాయి.
ఇక బిల్లు పాసయ్యే సమయంలో కాంగ్రెస్ పార్టీ, అన్నాడీఎంకేతో సహా ఇతరవిపక్షపార్టీలకు చెందిన చాలామంది సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. రెవెల్యూషనరీ సోషలిస్టు పార్టీకి చెందిన ప్రేమచంద్రన్ సూచించిన సవరణల తర్వాత బిల్లు పాస్ అయ్యింది. అయితే బిల్లుపై సవరణలు ప్రతిపాదించారు మజ్లిస్ నేత అసదుద్దీన్, బీజేడీ ఎంపీ భర్తృహరి మహతాబ్. అయితే వారు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. ఇదిలా ఉంటే బిల్లు ఏ ఒక్క మతానికి కానీ సామాజిక వర్గానికి కాని వ్యతిరేకంగా లేదని మంత్రి రవిశంకర ప్రసాద్ వివరించారు. ఇది కేవలం మహిళలకు కూడా సమాన హక్కులు కలిగి ఉంటారనే ఉద్దేశంతోనే తీసుకొచ్చిన బిల్లు అని చెప్పారు.
అంతకుముందు బిల్లుపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని అయితే ముందుగా బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే కోరారు. బిల్లుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు అసదుద్దీన్ ఓవైసీ. ఇస్లాం సంస్కృతికి మచ్చ తెచ్చేలా బిల్లు ఉందని ధ్వజమెత్తారు. ఇస్లాం మతంలో వివాహం అనేది ఒక ఒప్పందం మాత్రమే అని గుర్తు చేశారు. తలాక్ అనేది ఒప్పందాన్ని ఉల్లంఘించడం అని చెప్పారు. అయితే భర్తను జైలుకు పంపడం అనేది తప్పు అని చెప్పిన అసదుద్దీన్ భర్త జైలుపాలైతే భార్య పిల్లల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఆమెకు తిండి ఎవరు పెడతారని సభలో ప్రశ్నించారు అసదుద్దీన్ ఓవైసీ.
మొత్తానికి ట్రిపుల్ తలాక్ బిల్లుపై నాలుగు గంటల పాటు వాడీవేడి చర్చ జరిగిన తర్వాత లోక్సభలో ఆమోదం పొందింది. బిల్లుకు 238 మంది సభ్యులు మద్దతు తెలుపగా 12 మంది వ్యతిరేకించారు. ఇక బిల్లును సంయుక్త కమిటీకి పంపేందుకు ప్రభుత్వం నిరాకరించడంతో ఇందుకు నిరసన తెలుపుతూ కాంగ్రెస్, అన్నాడీఎంకే పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. దీంతో లోక్సభలో బిల్లు పాసైనట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధమని ఈ ఏడాది సెప్టెంబర్ లో మోదీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఈ ఆర్డినెన్స్ ను ఆరు నెలల్లోగా బిల్లు రూపంలో తీసుకురావాల్సిన క్రమంలో ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఇక రాజ్యసభలో బిల్లు పాస్ కావాల్సి ఉంది. గురువారం కావేరీ సమస్యతో రాజ్యసభ దద్దరిల్లిపోవడంతో ఛైర్మెన్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు.