అది మా మేనిఫెస్టోలో ఉంది..కచ్చితంగా ఆ బిల్లును సభలో మళ్లీ ప్రవేశపెడతాం: రవిశంకర్ ప్రసాద్
న్యూఢిల్లీ: వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లుపై కేంద్రం మళ్లీ దృష్టి సారించింది. ట్రిపుల్ తలాక్ను నిషేధిస్తూ బిల్లును లోక్సభలో మళ్లీ ప్రవేశపెడతామని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. గత నెలలో 16వ లోక్సభ రద్దు కావడంతో లోక్సభలో బిల్లు పాస్ కాకపోవడం.. ఆ తర్వాత రాజ్యసభలో పెండింగ్లో పడిపోవడంతో బిల్లు నీరుగారిపోయింది. సాధారణంగా రాజ్యసభలో బిల్లులు పెండింగ్లో ఉండి లోక్సభ రద్దు అయితే బిల్లులు విఫలం కావుకానీ... అదే లోక్సభలో ప్రవేశపెట్టి పెండింగ్లో ఉండి లోక్సభ రద్దయితే విఫలం అవుతాయి.
రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును పాస్ చేయాలని భావించినప్పటికీ అందుకు ప్రభుత్వం దగ్గర సరిపడా సభ్యుల మద్దతు లేకపోవడంతో బిల్లును పాస్ చేయించలేకపోయారు.అంతేకాదు విపక్షాలు కూడా బిల్లులోని పలు అంశాలపై అభ్యంతరం తెలిపాయి. ట్రిపుల్ తలాక్ బిల్లును తిరిగి ప్రవేశ పెడుతారా అన్న ప్రశ్నకు తప్పకుండా ప్రవేశపెట్టి పాస్ చేయిస్తామని అన్నారు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్. ట్రిపుల్ తలాక్ బిల్లు తమ మేనిఫెస్టోలో ఉందని ఆయన గుర్తుచేశారు. యూనిఫాం సివిల్ కోడ్ గురించి అడుగగా ప్రభుత్వం రాజకీయ పార్టీలతో చర్చించిన తర్వాతే దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.
ఇక ముస్లిం మహిళల రక్షణ కోసం గత బీజేపీ ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. ముఖ్యంగా ట్రిపుల్ తలాక్ చెప్పి భార్యకు విడాకులు ఇవ్వడాన్ని తప్పుబట్టింది. అంతేకాదు అలా చేయడం నేరంగా పరిగణించింది. అయితే ఇది ముస్లిం మతంలోకి వారి ఆచారంలోకి తలదూర్చడం సరికాదని విపక్షాలు వ్యతిరేకించాయి. భార్య నుంచి విడాకులు తీసుకుంటే భర్తకు జైలు శిక్ష విధించడాన్ని విపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. దీంతో ప్రభుత్వం రెండు సార్లు ఆర్డినెన్స్ తీసుకువచ్చింది.
తొలిసారిగా అంటే 2018 సెప్టెంబరులో ఆర్డినెన్స్ను బిల్లు రూపంలోకి తీసుకువచ్చే ప్రభుత్వ ప్రయత్నాలు లోక్సభలో గత డిసెంబరులో ఫలించినప్పటికీ రాజ్యసభలో పెండింగ్లో పడిపోయింది. ఇక తర్వాత బిల్లులో కొన్ని మార్పులు చేసింది ప్రభుత్వం. జైలు శిక్ష పడ్డ వాడు బెయిల్కు దరఖాస్తు చేసుకునేలా కూడా ఆప్షన్ ఇచ్చింది కేంద్రం. అంతేకాదు భార్య వాదనలు విన్న తర్వాతే మెజిస్ట్రేట్ తనకు ఇష్టమయితే బెయిల్ మంజూరు చేయొచ్చని పేర్కొంది. ఈ మార్పులన్నిటికీ గతేడాది ఆగష్టు 29న కేంద్ర కేబినెట్ క్లియర్ చేసింది.