ట్రిపుల్ తలాక్ బిల్లుతో మహిళలకు సమన్యాయం..! కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకరప్రసాద్..!
న్యూఢిల్లీ/ హైదరాబాద్ : ట్రిపుల్ తలాక్ బిల్లుపై కేంద్రం ఆచి తూచి స్పందించింది. సున్నితమైన అంశం పట్ల భావోద్వేగాలకు గురికాకుండా జాగ్రత్త వహించింది. ప్రత్యేకించి ఏ మతాన్నీ లక్ష్యంగా చేసుకుని ట్రిపుల్ తలాక్ బిల్లు తీసుకురావడం లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. గురువారం లోక్సభలో కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ట్రిపుల్ తలాక్ బిల్లుపై వాడివేడి చర్చ జరుగింది. ఈ సందర్భంగా రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ మానవత్వాన్ని ప్రోత్సహించేందుకే ఈబిల్లును తీసుకొచ్చామన్నారు. భారత మహిళలందరికీ న్యాయం చేయడమే ఈ బిల్లు లక్ష్యమని చెప్పారు. ట్రిపుల్ తలాక్ బిల్లును ముందుకు తీసుకెళ్లాలని గతవారం ప్రతిపాదించగా ఎలాంటి అవాంతరాలు సృష్టించకుండా చర్చకు సహకరిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని తెలిపారు.
ట్రిపుల్ తలాక్ చెల్లదంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పటికీ ప్రభుత్వం ఈ అంశంపై ఆర్డినెన్స్ తీసుకురావడంపైనా ఆయన స్పందించారు. దేశ వ్యాప్తంగా ముస్లిం మహిళలకు అల్పమైన విషయాలకు కూడా అప్పటికప్పుడు ట్రిపుల్ తలాక్ చెబుతున్నారని అలాంటి కేసుల్లో పార్లమెంటు చేతులు కట్టుకుని కూర్చోవాలా అని రవిశంకర్ ప్రసాద్ విపక్ష సభ్యులను ప్రశ్నించారు. 20 ఇస్లామిక్ దేశాలు ట్రిపుల్ తలాక్ను నిషేధించాయనీ... అలాంటప్పుడు లౌకిక దేశమైన భారతదేశంలో దాన్ని ఎందుకు కొనసాగించాలని నిలదీశారు. ఇక మీదట ముస్లిం మహిళలు వైవాహిక జీవితాన్ని స్వేచ్చగా ఎంపిక చేసుకునే వెసులు బాటు ఒక్క బీజేపీ ప్రభుత్వం మాత్రమే కల్పిందని ఆయన చెప్పుకొచ్చారు.