హిందువుగా మారతా, లేదంటే ఆత్మహత్యే: తలాఖ్ బాధిత మహిళ ఆవేదన
ట్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా మారో బాధిత మహిళ గళమెత్తింది. కొద్ది రోజుల క్రితం ట్రిపుల్ తలాక్ కారణంగా ఒంటరిగా మారిన ఆమె.. తనకు న్యాయం చేయకపోతే హిందూమతం స్వీకరిస్తానని స్పష్టం చేసింది.
డెహ్రాడూన్: ట్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా మారో బాధిత మహిళ గళమెత్తింది. కొద్ది రోజుల క్రితం ట్రిపుల్ తలాక్ కారణంగా ఒంటరిగా మారిన ఆమె.. తనకు న్యాయం చేయకపోతే హిందూమతం స్వీకరిస్తానని స్పష్టం చేసింది. అదీ సాధ్యం కాకపోతే తాను ఆత్మహత్యకు పాల్పడతానంటూ స్పష్టం చేసింది. ఆ ముస్లిం మహిళ చేసిన వ్యాఖ్యలు ఆమె ఎంతగా నలిగిపోతోందో తెలుపుతున్నాయి.
ఉత్తరాఖండ్లోని ఉద్దమ్ సింగ్ నగర్ గదార్పూర్లో ఆ మహిళకు ఆమె భర్త తలాక్ చెప్పి వెళ్లిపోయాడు. పెద్దలు నచ్చజెప్పడంతో మళ్లీ కాపురం చేసి, మళ్లీ తలాక్ చెప్పి వెళ్లిపోయాడు. పోలీస్ స్టేషన్లో ఆ మహిళ ఫిర్యాదు చేయగా అక్కడకు విచారణ కోసం వచ్చిన సదరు భర్త పోలీసుల ముందు కూడా తన భార్యకు తలాక్ చెప్పి వెళ్లిపోయాడు.
Udham Singh Nagar: #TripleTalaq victim threatens to commit suicide if not given justice, requests PM Modi & & the Supreme Court #Uttarakhand pic.twitter.com/tyIAWudSEp
— ANI (@ANI_news) May 19, 2017
దీంతో జహాన్ అనే ఆ మహిళ ఆవేదనకు అంతులేకుండా పోయింది. తన వ్యక్తిగత అనుభవాన్ని బట్టి హిందూ మతంలోకి మారిపోతే బాగుంటుందని అనిపిస్తోందని తెలిపింది. హిందూమతంలో ఇలాంటి ఆచారం లేదని చెప్పింది. ఒకవేళ మతం మారే అవకాశం రాకపోతే కనుక తాను ఆత్మహత్యకయినా సిద్ధమేనని పేర్కొంది.
తాను ఇప్పటికే చాలా బాధలు పడ్డానని, ఇక తన వల్ల కాదని బాధపడింది.12 ఏళ్ల క్రితం తనకు వివాహం జరిగిందని, తన భర్తపేరు ఆసిఫ్ అని చెప్పింది. తనకు తన భర్త నాలుగేళ్లకే విడాకులిచ్చేశాడని, అనంతరం మళ్లీ వచ్చి కాపురం చేసినా మళ్లీ తలాక్ అంటూ వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు, తన లాంటి మహిళలకు న్యాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ, సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది.