ట్రిపుల్ తలాక్ నుంచి జమిలి ఎన్నికల వరకు.. ప్రభుత్వ పనితీరుపై రాష్ట్రపతి ప్రశంసలు..
ఢిల్లీ : 17వ లోక్సభ కొలువుదీరిన నేపథ్యంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వం అమలుచేస్తున్న, చేపట్టనున్న చర్యల గురించి వివరించారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు అభినందనలు తెలిపిన కోవింద్... చట్టసభలో మహిళళ ప్రాతినిధ్యం పెరగడంపై సంతోషం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికలను సజావుగా నిర్వహించిన ఎన్నికల సంఘాన్ని రాష్ట్రపతి అభినందించారు. ఈ సందర్భంగా ఐదేళ్ల రోడ్ మ్యాప్ను ప్రకటించారు.
ఒక దేశం- ఒక ఎన్నిక: సాధ్య సాధ్యాలపై కమిటీ ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం
సబ్కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్..
లోక్సభ ఎన్నికల్లో ప్రజలు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చిన ప్రజలు 2014 నుంచి కొనసాగుతున్న ప్రభుత్వానికి మరోసారి అవకాశమిచ్చారని రామ్నాథ్ చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకే తమ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం కృషి చేస్తున్నామన్న రాష్ట్రపతి అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగానే సబ్కా సాథ్ - సబ్కా వికాస్ - సబ్కా విశ్వాస్ నినాదంతో ముందుకెళ్తున్నామని చెప్పారు.
అన్నదాతలకు అండ
దేశానికి అన్నం పెట్టే రైతన్నల అభ్యన్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా పెట్టుబడి సాయం అందించడంతో పాటు 60ఏళ్లు దాటిన రైతులకు పెన్షన్ అందించనున్నట్లు చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులు పెంచేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందని భరోసా ఇచ్చారు. జల సంరక్షణకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్న రాష్ట్రపతి స్వచ్ఛ్ భారత్ తరహాలో జలసంరక్షణ చేపడతామని ప్రకటించారు.
జీవన ప్రమాణాల మెరుగుదల
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తుందని రాష్ట్రపతి చెప్పారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, గ్రామీణ ప్రాంతాలకు పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. ప్రతి ఒక్కసారి గూడు కల్పించడంతో పాటు ఆరోగ్య పరిరక్షణ కోసం వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. యువ భారత్ స్వప్నాలు సాకారం చేసేందుకు విద్యా, ఉపాధి అవకాశాల కల్పనకు మరిన్ని కోర్సులు తీసుకురానున్నట్లు రాష్ట్రపతి స్పష్టం చేశారు.
మహిళా సాధికారితకు కృషి
ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అని మాటల్లో చెప్పడమే కాదు.. చేతల్లో చూపించేందుకు తమ సర్కారు నిబద్ధతతో కృషి చేస్తుందని రాష్ట్రపతి ప్రకటించారు. మహిళా సాధికారిత కోసం ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా తదితర పద్దతులకు స్వస్తి పలకాల్సిన అవసరముందని అన్నారు. ఒకే దేశం ఒకేసారి ఎన్నికతో పాటు ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తామన్న రామ్నాథ్ ఒకే దేశం ఒకే రవాణాకార్డు సదుపాయాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. త్వరలో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించడంతో పాటు జీఎస్టీని మరింత సరళీకరించే ప్రయత్నాలు చేస్తున్నామని రాష్ట్రపతి ప్రకటించారు. 2024 నాటికి భారత్ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికశక్తిగా రూపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని స్పష్టం చేశారు.