'దాగుడు మూతల' పేరుతో దారుణం... 8 ఏళ్ల బాలికపై ఏడుగురు టీనేజర్స్ గ్యాంగ్ రేప్...
త్రిపురలో దారుణం జరిగింది. ఏడుగురు టీనేజ్ బాయ్స్ 8 ఏళ్ల ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. దాగుడుమూతలు ఆడుకుందామని పిలిచి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే... పశ్చిమ త్రిపుర జిల్లాలోని తబారియా గ్రామానికి చెందిన ఏడుగురు టీనేజర్స్ శుక్రవారం(అగస్టు 28) అదే గ్రామానికి చెందిన ఓ మూడో తరగతి విద్యార్థినిని దాగుడు మూతలు ఆడుకుందామని పిలిచారు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
ఇంటికి తిరిగొచ్చిన బాలిక తల్లిదండ్రులతో అసలు విషయం చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేసులో నిందితులైన ఏడుగురు టీనేజర్స్ ఆ బాలికకు పరిచయస్తులేనని గుర్తించారు. ఇందులో ఆరుగురిని ఇప్పటికే అరెస్ట్ చేయగా మరొకరు పరారీలో ఉన్నారు.
Recommended Video
అరెస్టయిన ఆరుగురిలో నలుగురిని జువైనల్ హోమ్కు తరలించారు. 12 ఏళ్ల వయసున్న మరో ఇద్దరు నిందితులకు కరోనా సోకినట్లు నిర్దారణ కావడంతో వారిని ఆస్పత్రిలో చేర్చారు. ఘటనపై తమకు శనివారం(అగస్టు 29) ఫిర్యాదు అందిందని సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ప్రియా మాధురి మజుందార్ తెలిపారు. ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.