త్రిపురలో బీజేపీకి బిగ్ షాక్... ఏడీసీ ఎన్నికల్లో కొత్త కూటమి ఘనవిజయం...
త్రిపుర గిరిజన మండలి (త్రిపుర ట్రైబల్ ఏరియాస్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్- టీటీఏఏడీసీ) ఎన్నికల్లో అధికార బీజేపీకి గట్టి షాక్ తగిలింది. కొత్తగా ఏర్పడిన స్వదేశీ ప్రోగ్రెసివ్ రీజినల్ అలయన్స్ (తిప్రా) కౌన్సిల్ ఎన్నికల్లో విజయం సాధించింది.ఎన్నికలు జరిగిన 28 సీట్లలో ఈ కొత్త కూటమి 18 సీట్లు గెలుచుకున్నది.బీజేపీ కూటమి 9 సీట్లు దక్కించుకోగా.. ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. గతంలో 25 సీట్లలో విజయం సాధించిన వామ పక్ష కూటమి, కాంగ్రెస్ ఈసారి ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోవడం గమనార్హం. మొత్తం 30 సీట్లు ఉన్న త్రిపుర గిరిజన మండలిలో రెండు సీట్లను గవర్నర్ నామినేట్ చేస్తారు.
దశాబ్దాలుగా త్రిపురను ఏలుతున్న సీపీఎంను మట్టి కరిపించి 2018లో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ-ఐపీఎఫ్టీ కూటమి... రెండేళ్లు తిరగకుండానే కొత్త కూటమి చేతిలో ఘోర పరాభవాన్ని చవిచూడటం చర్చనీయాంశంగా మారింది. అయితే త్రిపుర గిరిజన మండలి ఎన్నికల్లో బీజేపీ తమ మిత్రపక్షంతో కలిసి 9 స్థానాలు గెలుచుకోవడం ఇదే తొలిసారి కావడం వారికి ఊరట కలిగించే విషయం.
Recommended Video
తిప్రా మోతా కూటమి ఎన్నికలకు కొద్ది నెలల క్రితమే పురుడు పోసుకుంది. త్రిపుర రాజవంశీకుడు ప్రద్యోత్ విక్రమ్ మాణిక్య దేబ్ బర్మన్ దీన్ని ఏర్పాటు చేశారు. గతంలో ఆయన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే 2019లో కాంగ్రెస్ను వీడి బయటకొచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు.తాజాగా జరిగిన త్రిపుర మండలి ఎన్నికల్లో ఆయన తకర్జలా-జంపుయిజలా నుంచి గెలుపొందారు. తిప్రా నుంచి పోటీ చేసిన సీనియర్ నేతలు అనంత దేబ్ బర్మ,అనిమేశ్ దేబ్ బర్మ,ఐఎన్పీటీ జనరల్ సెక్రటరీ జగదీశ్ దేబ్ బర్మ కూడా విజయం సాధించారు.