సీన్ రివర్స్: కనీసం డిపాజిట్ కూడా రాలేదు! మేఘాలయపై బీజేపీ వ్యూహం, కాంగ్రెస్ అప్రమత్తం
అగర్తాలా: త్రిపురలో బీజేపీ విజయ దుందుభి మోగించింది. సీపీఎం కంచుకోటగా ఉన్న త్రిపురను బీజేపీ తొలిసారి తన ఖాతాలో వేసుకుంది. బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. ఈ విజయానికి ప్రధాని నరేంద్ర మోడీయే కారణమని బీజేపీ నేతలు చెబుతున్నారు.
త్రిపురలో బీజేపీ గెలుపు వెనుక: సీపీఎంను అక్కడా దెబ్బకొట్టి.. ఎవరీ సునీల్ దియోదర్?
త్రిపురలో నాలుగు దఫాలుగా ముఖ్యమంత్రిగా ఉంటూ అవినీతి మకిలి అంటని నేత మాణిక్ సర్కార్. అలాంటి నేతను ప్రాభవాన్ని సైతం బీజేపీ వెనక్కి నెట్టింది. 59 స్థానాలకు ఎన్నికలు జరగగా స్పష్టమైన ఆధిక్యత సంపాదించింది. కాంగ్రెస్ ఒక్క సీటు దక్కించుకోలేకపోయింది.
2013లో కనీసం డిపాజిట్ దక్కించుకోని బీజేపీ
2013 అసెంబ్లీ ఎన్నికల్లో త్రిపురలో బీజేపీ 50 స్థానాల్లో పోటీ చేయగా 49 స్థానాల్లో కనీసం డిపాజిట్లు దక్కలేదు. అయితే గత ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ 55 స్థానాల్లో పోటీ చేయగా 49 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 48 స్థానాల్లో పోటీ చేసి 10 స్థానాలు దక్కించుకుంది.
సీన్ రివర్స్
అయితే, ఈ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. బీజేపీ నేతలు నిర్వహించిన ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్లింది. మార్పు, అభివృద్ధి నినాదంతో బీజేపీ ముందుకు వెళ్లింది. దానికి తగిన ఫలితాలు దక్కాయి. మరోవైపు, నాగాలాండ్లోను మిత్రపక్షాలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
మేఘాలయలో కాంగ్రెస్కు ఊరట
ఒక్క మేఘాలయనే కాంగ్రెస్ పార్టీకి ఊరట. త్రిపుర, నాగాలాండ్లలో కాంగ్రెస్ కనీసం ఒక్క సీటు దక్కించుకోలేకపోయింది. మేఘాలయలో మాత్రం కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకుంటోంది. మేఘాలయలో కాంగ్రెస్ గత పదేళ్లుగా అధికారంలో ఉంది. ఈసారి కూడా గెలిస్తే హ్యాట్రిక్.
బీజేపీ పావులు
అయితే ప్రభుత్వ ఏర్పాటుకు సరిపోయే సీట్లు వచ్చేలా కనిపించడం లేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ చెక్ చెప్పేందుకు ఇతర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. బీజేపీ అప్పుడే మేఘాలయలో షాకిచ్చేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు ఇప్పటికే అహ్మద్ పటేల్, కమల్ నాథ్లు మేఘాలయ బయలుదేరారు.