బిజెపి నేతకు ప్రభుత్వ ఉద్యోగం: సీఎంకు సిఫారసు చేసిన త్రిపుర గవర్నర్, రచ్చ
అగర్తల: ప్రభుత్వ ఉద్యోగానికి బిజెపి నేత పేరును సిఫారసు చేసి త్రిపుర రాష్ట్ర గవర్నర్ తథాగతరోయ్ మరో వివాదం చిక్కుకున్నారు. బెంగాల్ రాష్ట్రానికి చెందిన బిజెపి నేత సర్వదామన్ రాయ్కు అకౌంట్ సెక్షన్లో ఉద్యోగం ఇప్పించాలంటూ సీఎం విప్లవ్కుమార్ దేవ్కు లేఖ రాశారు.
అయితే ఈ లేఖ బయటకు రావడంతో తీవ్ర దుమారం రేగుతోంది. సర్వదామన్తో నేను బీజేపీలో పని చేశా. ఆయన ఛార్టెడ్ అకౌంటెంట్లో నిపుణులు. పలు ప్రముఖ కంపెనీలో పని చేశారు. ఆయన సేవలను ప్రభుత్వం వినియోగించుకుంటే మంచిదని భావిస్తున్నానని తథాగత రాయ్ ఆ లేఖలో పేర్కొన్నారు.
అయితే ఈ లేఖ బయటకు రావడంతో విపక్ష సీపీఎం గవర్నర్ తీరుపై విమర్శలు ఎక్కుపెట్టింది. గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శి ఈ లేఖ గురించి తెలీదని చెబుతుండగా సీఎం కార్యాలయం మాత్రం ఈ వ్యవహారంపై స్పందించేందుకు నిరాకరించింది.
అయితే ఈ విషయమై తథాగత రోయ్ ట్వీటర్లో స్పందించారు. ఆ లేఖను నేనే రాసింది. ఓ ఉద్యోగం కోసం సత్ప్రవర్తన కింద ఆ లేఖ ఇచ్చాను. ఆ మాత్రం దానికే కొలంబస్ అమెరికాను కనిపెట్టి మీరు భావిస్తున్నారు. అంటూ ఓ ట్వీట్లో ఆయన చురకలంటించారు. ఇక ఈ లేఖపై కథనాలు ప్రసారం చేస్తున్న ఓ న్యూస్ ఛానెల్పైనా ఆయన మండిపడ్డారు.
తథాగత వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగా ఉంది. ఆయన ఓ గవర్నర్ మాదిరి కాకుండా బీజేపీ ఏజెంట్గా వ్యవహరిస్తున్నాడంటూ సీపీఎం విమర్శలు చేస్తోంది.