పొరపాటుకు చింతిస్తున్నా..: మాజీ ప్రధాని ఇకలేరంటూ గవర్నర్ ట్వీట్
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని వాజపేయి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇకలేరంటూ త్రిపుర గవర్నర్ తథాగత రాయ్ చేసిన ట్వీట్ కలకలం రేపింది.
'గొప్ప వక్త, ఆరు దశాబ్దాల పాటు భారత రాజకీయాల్లో ధృవతారలా వెలిగిన మాజీ ప్రధాని వాజపేయి ఇకలేరు. ఓం శాంతి' అంటూ ఆయన ట్వీట్ చేశారు. క్షణాల్లోనే ఈ ట్వీట్ వైరల్ అయింది. దీంతో, ఆయనపై నెటిజన్లు విమర్శలు చేశారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్న తథాగత రాయ్ తన ట్వీట్ ను తొలగించారు.
Recommended Video
'నన్ను క్షమించండి. ఓ జాతీయ మీడియా ఛానల్లో వచ్చిన వార్తను చూసి నేను ట్వీట్ చేశాను. ట్వీట్ చేసే ముందు అది నిజమా, కాదా? అనే విషయాన్ని తెలుసుకుని ఉండాల్సింది. వాజపేయి గురించి ఎలాంటి అధికారిక వార్త వెలువడలేదు. నా ట్వీట్ ను తొలగించాను. క్షమించండి' అంటూ మరో ట్వీట్ చేశారు తథగాగత రాయ్.
వాజపేయి ఆరోగ్యం విషమంగానే ఉందని, వెంటిలేటర్పై చికిత్స కొనసాగుతోందని ఎయిమ్స్ వైద్యులు గురువారం ఉదయం హెల్త్ బులెటిన్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.