మరో దారుణం: గోవులను దొంగలించేందుకు వచ్చాడని వ్యక్తిని కొట్టి చంపిన గ్రామస్తులు
త్రిపురా: గోవులను స్మగ్లింగ్ చేస్తున్నారన్న ఆరోపణలపై ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు సామూహిక దాడులు చేశారు కొందరు హిందూ సంఘాలకు చెందినవారు. గత కొద్ది రోజులుగా ఇలాంటి వార్తలు వినిపించలేదు..కనిపించలేదు. తాజాగా ఈశాన్య రాష్ట్రంలో గోవులను దొంగలించాడనే నెపంతో ఓ వ్యక్తిని కొట్టి చంపిన ఘటన వెలుగు చూసింది. ఈ ఘటన త్రిపురలో చోటుచేసుకుంది.
త్రిపుర రాష్ట్రం దలాయ్ జిల్లాలో ఓ వ్యక్తిని కొందరు కొట్టి చంపారు. గోవులను దొంగలిస్తున్నాడన్న అనుమానం రావడంతో 36 ఏళ్ల బుది కుమార్ త్రిపురా అనే వ్యక్తిని మన్యకుమార్ పారా అనే మారుమూల గిరిజన గ్రామంలో కొట్టి చంపారు. స్థానిక గ్రామస్తుని ఇంట్లో ఉన్న గోవుల షెడ్డులోకి బుది కుమార్ ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. ఎవరో తన గోవుల షెడ్డులోకి ప్రవేశించారని గమనించిన ఇంటి యజమాని వెంటనే కేకలు వేశాడు. పొరుగింటి వారు కూడా వచ్చి బుది కుమార్ను పట్టుకున్ని చితకబాదారు.
ఇదిలా ఉంటే యజమాని కేక వేయగానే బుధి కుమార్ తప్పించుకునే ప్రయత్నంలో పరుగులు తీశాడని అయితే వారంతా అతన్ని వెంబడించి పట్టుకున్నట్లు స్థానికులు తెలిపినట్లు పోలీసులు చెప్పారు. పట్టకున్న గ్రామస్తులు బుధికుమార్ను చితకబాదినట్లు పోలీసులు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అర్థరాత్రి సమయంలో బుధి కుమార్ను కాపాడారు. స్థానిక హాస్పిటల్లో చికిత్స కోసం తరలించారు. చికిత్స పొందుతున్న బుధి కుమార్ బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదిక రాగానే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
గోవులను దొంగలించేవారికి కఠిన శిక్ష విధించాలని త్రిపురా గోరక్ష బహిని ప్రెసిడెంట్ ముర్తాజా ఉద్దిన్ చౌదరి అన్నారు. అదే సమయంలో ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదని చెప్పారు. గోవులను దొంగతనం చేసేవారిని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే వారే తగిన చర్యలు తీసుకుంటారని అన్నారు. 2018లో త్రిపురలోని బీజేపీ-ఐపీఎఫ్టీ ప్రభుత్వం సామూహిక దాడిలో గాయపడినవారికి కానీ, మృతి చెందిన వారికి గానీ పరిహారం చెల్లిస్తోంది. సుప్రీం కోర్టు 2018లో ఇచ్చిన తీర్పును అనుసరించి త్రిపురా రాష్ట్రం ఈ పరిహారాన్ని బాధితులకు ఇస్తోంది.
సామూహిక దాడుల్లో మృతి చెందితే ప్రభుత్వం రూ. 4 లక్షలు మృతుల కుటుంబ సభ్యులకు అందజేయాలని నిబంధనలు చెబుతున్నాయి. 80శాతం గాయపడితే రూ. 2లక్షలు, 40 నుంచి 80శాతం గాయాలైతే రూ. 1 లక్ష పరిహారం చెల్లించాలని నిబంధనలు చెబుతున్నాయి.