దో గజ్ దూరి!: ఈ బైక్ భౌతిక దూరం పాటిస్తుంది!
అగర్తాలా: కరోనాను ఎదుర్కోవాలంటూ సామాజిక(భౌతిక) దూరం తప్పనిసరి అని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్రిపురకు చెందిన ఓ మెకానిక్ భౌతిక దూరం పాటించేలా ఉండే ఓ ద్విచక్ర వాహనాన్ని రూపొందించారు.
బ్యాటరీతో నడిచే ఈ వాహనాన్ని పార్థ సాహా అనే మెకానిక్ తయారు చేయడం గమనార్హం. ప్రయాణించే సమయంలోనూ సామాజిక దూరం పాటించేలా రూపొందించిన ఈ బైక్ ఇప్పుడు స్థానికంగానే గాక దేశ వ్యాప్తంగా ఆసక్తికర అంశంగా మారింది.
అగర్తాలోని అరలియాకు చెందిన సాహా.. బ్యాటరీతో నడిచేవిధంగా రూపొందించిన బైక్.. సీట్ల మధ్య దూరం ఉంచారు. తన కూతురుతోపాటు కుటుంబసభ్యులను తీసుకెళ్లేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు సాహా. ఈ బైక్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని తెలిపారు.
కాగా, దేశంలో ఇప్పటి వరకు 29,219 కేసులు నమోదు కాగా, 7038 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 21,247 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో ఇప్పటి వరకు 934 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా లాక్డౌన్ మే 3 వరకు అమలులో ఉన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సోమవారం ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్డౌన్ కఠినంగా అమలు చేయాలని, సామాజిక దూరం పాటించాలని స్పష్టం చేశారు. పలు సడలింపులు కల్పించినప్పటకీ సామాజిక దూరం పాటించేలా చూడాలని తెలిపారు. మాస్కులు ధరించడం కూడా తప్పనిసరి అని తెలిపారు.