ఎన్నికల ఫలితాల వేళ విషాదం: 6సార్లు ఎమ్మెల్యే, త్రిపుర మంత్రి ఖగేంద్ర కన్నుమూత
న్యూఢిల్లీ/ అగర్తాల: త్రిపుర రాష్ట్ర మత్స్య, కార్పొరేషన్ శాఖల మంత్రి, సీపీఎం నేత ఖగేంద్ర జమాటియా(64) కన్నుమూశారు. బ్లడ్ క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్న ఖగేంద్ర న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందారు. ఈ విషయాన్ని త్రిపుర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పవిత్రా కౌర్ వెల్లడించారు.
ఖగేంద్ర భౌతికకాయాన్ని ఢిల్లీ నుంచి స్వస్థలానికి తరలించనున్నారు. త్రిపుర అసెంబ్లీకి గత ఫిబ్రవరి 18న ఎన్నికలు జరగగా.. ఆ మరుసటిరోజే ఖగేంద్ర తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను తొలుత గోవింద బల్లావ్ పంత్ ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్ల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం ఫిబ్రవరి 25న న్యూఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించి చికిత్స అందించారు.
వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలకావడం కావడంతో మంత్రి ఖగేంద్ర కన్నుమూశారని సీపీఎం అధికార ప్రతినిధి గౌతం దాస్ వెల్లడించారు. కాగా, ఖగేంద్ర జమాటియా 1983లో సీపీఎంలో చేరారు.
ఇటీవల జరిగిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో క్రిష్ణాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఖగేంద్ర.. 1988 నుంచి ఆరుసార్లు వరుసగా ఎన్నికల్లో విజయం సాధించారు. రెండు పర్యాయాలు త్రిపుర కేబినెట్లో మంత్రిగా సేవలందించారు. శనివారం త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెలువడుతున్న వేళ ఖగేంద్ర మరణం సీపీఎం శ్రేణుల్లో విషాదం నింపింది.