మార్క్సిస్ట్ మంత్రులకు మోడీ పాఠాలు, తప్పేంటని లెఫ్ట్ సీఎం
అగర్తాలా: కరడుగట్టిన కమ్యూనిస్ట్ నేత, బీజేపీ నేత.. రాజకీయంగా, సైద్ధాంతికంగా ఇద్దరూ భిన్న ధృవాలైన వారు ఒకే పరస్పరం పొగుడుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్... మధ్య సోమవారం ఈ అరుదైన సంఘటన జరిగింది. త్రిపురలో ఒక విద్యుత్ ప్లాంట్ ప్రారంభించేందుకు వచ్చిన మోడీని తన మంత్రివర్గ సహచరులకు సుపరిపాలన పాఠాలు చెప్పమని మాణిక్ సర్కార్ ఆహ్వానించారు.
ఆయన ఆహ్వానాన్ని మన్నించిన మోడీ త్రిపుర కేబినెట్ సమావేశంలో ప్రసంగించారు. ఈ సమావేశంలో మూడు దశాబ్దాల పాటు త్రిపురను వేధించిన తిరుగుబాటుదారుల సమస్యను వామపక్ష ప్రభుత్వం పరిష్కరించిన తీరును ప్రధాని ప్రశంసించారు. ఈ విజయ రహస్యం ఏంటో చెప్పాలని ముఖ్యమంత్రిని కోరారు. దాంతో ఆయన భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో పాటు ప్రజల మద్ద తు కూడగట్టడమే ఈ విజయ రహస్యమన్నారు.
తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేసిన రాజకీయ, సైద్ధాంతిక ప్రచారం కూడా ఇందుకు దోహదం చేసిందన్నారు. దాంతో డిసెంబర్ 7న ఢిల్లీలో జరిగే ప్రణాళికా సంఘం సమావేశంలో ఈ అంశంపై చర్చించేందుకు సవివరమైన నివేదిక పంపించాలని మోడీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ను కోరారు.
త్రిపురలో ఐఐఎం, ఐఐటి, కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం, సహజ వాయువు ఆధారిత యూరియా ఎరువుల కర్మాగారం ఏర్పాటుతో పాటు మొత్తం తొమ్మిది డిమాండ్లను ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఈ సందర్భంగా మోడీ ముందుంచారు. తమ డిమాండ్లపై మోడీ సానుకూలంగా స్పందించారని మాణిక్ విలేకరుల సమావేశంలో చెప్పారు.
అంతకుముందు మాణిక్ సర్కారు మాట్లాడుతూ.. సుపరిపాలన అంశంపై తన కేబినెట్ను ఉద్దేశించి ప్రసంగించాలని మోడీని ఆహ్వానిస్తే తప్పేమిటన్నారు. ప్రతి రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక సమస్యలు, అనుకూలతలు, ప్రతికూలతలు ఉంటాయన్నారు. ఆ కోణంలోనే రాష్ట్రాల నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు.
కాగా, వామపక్ష ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ స్వచ్ఛ భారత్ అభియాన్కు మద్దతు పలికారు. అయితే, 3-4 ఏళ్ల ముందే తాము త్రిపురలో ఈ తరహా కార్యక్రమాన్ని అమలు చేశామని చెప్పారు. దేశం పరిశుభ్రంగా ఉండడాన్ని అందరూ ఇష్టపడతారని పేర్కొన్నారు.