ఉత్తరాఖండ్ సీఎంగా త్రివేంద్ర సింగ్ ప్రమాణం: మోడీ, అమిత్ షా హాజరు
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా త్రివేంద్రసింగ్ రావత్ శనివారం ప్రమాణస్వీకారం చేశారు. పరేడ్ మైదానంలో నిర్వహించిన ఈ వేడుకలో గవర్నర్ కృష్ణకాంత్పాల్ ఆయనతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా త్రివేంద్రసింగ్ రావత్ శనివారం ప్రమాణస్వీకారం చేశారు. పరేడ్ మైదానంలో నిర్వహించిన ఈ వేడుకలో గవర్నర్ కృష్ణకాంత్పాల్ ఆయనతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. ఆయనతోపాటు మంత్రులుగా ప్రకాశ్ పంత్, మదన్ కౌశిక్, యశ్పాల్ ఆర్య, సుబోధ్ ఉనియల్, రేఖ ఆర్య ప్రమాణస్వీకారం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా, కేంద్రమంత్రులు రాజ్నాథ్సింగ్, జేపీ నడ్డా, ఉమాభారతి, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత హరీశ్రావత్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 సీట్లకు గాను బీజేపీ 57 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో శుక్రవారం సమావేశమైన ఆ పార్టీ శాసనసభాపక్షం తమ నేతగా త్రివేంద్రసింగ్ రావత్ను ఎన్నుకుంది. మాజీ మంత్రి, పితోర్గఢ్ ఎమ్మెల్యే ప్రకాశ్ పంత్ను తొలుత ఎన్నుకోవాలనుకున్నప్పటికీ చివరకు త్రివేంద్ర సింగ్ వైపే మొగ్గుచూపారు.