అక్కడ అలా..ఇక్కడ ఇలా: సీట్ల పంపకాల్లో ఇరుకున పడ్డ కాంగ్రెస్
2019 సార్వత్రిక ఎన్నికలకు మూడునెలల సమయం ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎలక్షన్ ఫీవర్ కనిపిస్తోంది. ఇప్పటికే జాతీయ మీడియా సర్వేల పేరుతో ఫలితాలను అంచనా వేస్తుండటంతో హీట్ మరింత పెరిగింది. ఇప్పటికే పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. పొత్తులపై చర్చించుకుంటున్నాయి. అయితే పొత్తుల సందర్భంగా జరుగుతున్న చర్చల్లో మాత్రం ఎవరూ తగ్గడం లేదు.
పార్టీల మధ్య కుదరని సీట్ల పంపకాలు
దేశంలో ఎన్నికల వేడి ఊపందుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలు సమీకరణాలతో సిద్ధమైపోతున్నాయి. ఎవరి ఎత్తుగడలు వారు వేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. పొత్తు పెట్టుకుంటున్న పార్టీలు తమ సహచర పార్టీలతో చర్చలు ప్రారంభించాయి. అయితే రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. కర్నాటక రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది. అక్కడ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల తర్వాత కాంగ్రెస్ జేడీఎస్లు జతకట్టాయి. రెండు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జేడీఎస్ కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయి. కర్నాటక పరిస్థితి ఇలా ఉంటే బీహార్లో కూడా దాదాపు ఇలాంటి సిచువేషనే నెలకొంది. అక్కడ కాంగ్రెస్ ఆర్జేడీల మధ్య సీట్ల పంపకాలపై స్పష్టత రాలేదు.
12 స్థానాలు కేటాయించాలని కాంగ్రెస్ను కోరుతున్న జేడీఎస్
ముందుగా కర్నాటక పరిస్థితి చూస్తే... అక్కడ కాంగ్రెస్ జేడీఎస్లు కలిసి పోటీచేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే కర్నాటకలో 28 స్థానాలుండగా 12 స్థానాలు తమకు కేటాయించాలని జేడీఎస్ అధినేత కర్నాటక సీఎం కుమారస్వామి కాంగ్రెస్ను కోరుతున్నారు. అయితే దీనిపై అధికారిక చర్చలు ప్రారంభం కాకముందే కాంగ్రెస్ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. 2014లో బీజేపీ 17 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ 10 స్థానాల్లో , జేడీఎస్ 2 స్థానాల్లో విజయం సాధించింది. ఇక నవంబర్ 2018లో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ జేడీఎస్లు కలిసి మూడు స్థానాలు దక్కించుకున్నాయి. బళ్లారిని కాంగ్రెస్ దక్కించుకోగా... మాండ్యాలో జేడీఎస్ విజయఢంకా మోగించింది. షిమోగా మాత్రమే బీజేపీకి వెళ్లింది. ఇక చర్చల తర్వాతే కర్నాటకలో సీట్ల పంపకాలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
అమేథీకి రాహుల్ గాంధీ గుడ్ బై చెప్పనున్నారా..? నాందేడ్ నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం
12 స్థానాలు ఇవ్వాలని ఆర్జేడీ ముందు కాంగ్రెస్ ప్రతిపాదన
ఇక బీహార్లో పరిస్థితి చూస్తే మరోలా ఉంది. కాంగ్రెస్ ఆర్జేడీల మధ్య ఇంకా స్పష్టత రాలేదు. ఫిబ్రవరి మొదటి వారంలో కాంగ్రెస్, ఆర్జేడీ, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీలు కలిసి చర్చలు జరపనున్నాయి. మొత్తం 40 పార్లమెంట్ స్థానాలున్న బీహార్లో ఎవరు ఎన్ని సీట్లలో పోటీచేయాలో చర్చల తర్వాత తెలిసే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఆర్జేడీల మధ్యే ప్రధానంగా సీట్ల పంపకాలు జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ 12 స్థానాలు అడుగుతుండగా ఆర్జేడీ ఇందుకు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. ఆర్జేడీ ఆర్ఎల్ఎస్పీలు కలిసి 20 నుంచి 22 సీట్లకు పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా సీట్లను కాంగ్రెస్కు కేటాయించే అవకాశం ఉంది. చిన్న పార్టీ అయిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ సర్దుకుపోయేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ... ఆర్జేడీ కాంగ్రెస్ల మధ్య అవగాహన కుదరాల్సి ఉంది.