మణిపూర్లో వాడిన కమలం: మెనార్టీలో బీజేపీ ప్రభుత్వం.. కాంగ్రెస్ చేతికి మరో రాష్ట్రం..?
మణిపూర్: మార్చి నెలలో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంను కూల్చి గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రంలో మాత్రం తన పట్టును నిలుపుకోలేకపోయింది. మణిపూర్లో బీజేపీ ప్రభుత్వం పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది. ఇప్పటి వరకు బీరేన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన నేషనల్ పీపుల్స్ పార్టీ అధికారిక బీజేపీకి సపోర్టును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడంతో అక్కడ ప్రభుత్వం కష్టాల సుడిలో చిక్కుకుంది.
2017లో మణిపూర్కు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 28 సీట్లు గెల్చుకుని అతిపెద్ద సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. బీజేపీ 21 సీట్లు సాధించింది. అయితే మొత్తం 60 సీట్లున్న మణిపూర్ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లు 31 ఉండగా రెండు జాతీయ పార్టీలకు మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో నేషనల్ పీపుల్ పార్టీ, నాగా పీపుల్ ఫ్రంట్ మరియు లోక్జనశక్తి పార్టీలు మద్దతు తెలపడంతో బీజేపీ ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేషనల్ పీపుల్ పార్టీ, నాగా పీపుల్ ఫ్రంట్కు చెరో నలుగురు ఎమ్మెల్యేలు ఉండగా లోక్జనశక్తి పార్టీకి ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. ఇక ఒక స్వతంత్ర అభ్యర్థి, టీఎంసీ ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడంతో బీజేపీ అధికారం చేపట్టింది. బీరేన్ సింగ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
తాజాగా మణిపూర్లో చోటుచేసుకున్న పరిణామాలు చూస్తే బీజేపీ ప్రభుత్వానికి అక్కడ ఇబ్బందులు తప్పవనే తెలుస్తోంది. నేషనల్ పీపుల్స్ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడంతో అక్కడ రాజకీయం వేడెక్కింది. అంతేకాదు టీఎంసీ ఎమ్మెల్యే, మరో స్వతంత్ర అభ్యర్థి కూడా తన సపోర్ట్ను విత్డ్రా చేసుకుంటున్నట్లు చెప్పడంతో బీరేన్ సింగ్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. అంతేకాదు ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేక జెండా ఎగురవేస్తూ రాజీనామాలు చేయడంతో బీరేన్ సింగ్కు కష్టాలు తప్పేలా లేవు. దీంతో బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం 23 సీట్లతో మైనార్టీలో పడిపోయింది.
Recommended Video
ఇక బీజేపీ ప్రభుత్వం కూలడం ఖాయమని భావించిన కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు తన ప్రయత్నాలు ప్రారంభించింది. మాజీ ముఖ్యమంత్రి ఇబోబి సింగ్ నేషనల్ పీపుల్ పార్టీతో సహా ఇతరుల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మొత్తానికి మధ్యప్రదేశ్ ఎపిసోడ్లో ఆపరేషన్ కమల్ సక్సెస్ కాగా... మణిపూర్లో మాత్రం కమలం వాడిపోయిందనే చెప్పాలి.